
మార్కెట్ షాపుల వేలం జరిగేనా?
సాక్షి ప్రతినిధి,గుంటూరు/నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొల్లి శారద మార్కెట్ చుట్టూ కుళ్లు రాజకీయాలు అలుముకున్నాయి. అక్కడి షాపులకు ఈ నెల 12, 13, 14వ తేదీల్లో వేలం నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. మరోవైపు ఈ వేలం ఆపేందుకు ఎమ్మెల్యేతోపాటు పాలకులు కుట్రలు పన్నుతున్నారు. ఎలాగైనా వేలం నిలిపివేసి చేసి గతంలో ఉన్న లీజులదారులకే గంపగుత్తగా కట్టబెట్టేందుకు ఓ ప్రజాప్రతినిధి కుట్ర చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మంత్రి ఫోన్.. ఆగిన వేలం?
1999లో కొల్లి శారద మార్కెట్లో 88 షాపులను నగరపాలక సంస్థ నిర్మించింది. 25 ఏళ్ల లీజు గడువుతో షాపులను కొంతమంది దక్కించుకున్నారు. వీటి గడువు గత ఏడాది మే 31తో ముగిసింది. అప్పటి నుంచి షాపులను స్వాధీనం చేసుకోనివ్వకుండా లీజుదారులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ స్టే రావడం, కార్పొరేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. చివరకు హైకోర్టు గత నెల షాపులకు వేలం నిర్వహించాలని, ప్రస్తుత లీజుదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఈ నెల 12, 13, 14వ తేదీల్లో 81 షాపులకు (మిగిలిన ఏడు షాపులు కొన్ని పాడైపోయాయి, మరికొన్ని లీజు గడువు పూర్తికానివి) వేలం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే వేలం నిర్వహించకుండా లీజు దారులు అన్ని మార్గాలు వెతుకుతున్నారు. వీరంతా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వద్దకు వెళ్లి మున్సిపల్ శాఖ మంత్రి ద్వారా కమిషనర్కు ఫోన్ చేయించినట్లు సమాచారం. దీంతో కమిషనర్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా కేటాయిస్తారు?
81 షాపులకు వేలం నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కచ్చితంగా కల్పించాలి. వీటిల్లో ఎస్సీలకు 12, ఎస్టీలకు 5, బీసీలకు 4, దివ్యాంగులకు 2 షాపులు చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ వేలం నిర్వహణకు నోటిఫికేషన్ ఈ నెల 2వ తేదీన విడుదల చేశారు. అయితే సదరు షాపుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా షాపులు కేటాయిస్తారంటూ లీజుదారులు, పాలకులు కమిషనర్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఎలాగైనా వేలం నిలిపేందుకు లీజు దారులు కుట్రలు పన్నుతున్నారు.
కొల్లి శారద మార్కెట్లోని షాపులు
వరాలమ్మకు వందనం
కార్పొరేషన్ ఆదాయానికి రూ. కోట్లలో గండి
81 షాపులకు వేలం నిర్వహిస్తే ఒక్కో షాపుకు బహిరంగ మార్కెట్లో నెలకు అద్దె రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు వెళ్లే అవకాశం ఉంది. గుడ్విల్ కింద కొంత మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇలా ఏడాదికి కార్పొరేషన్కు ఆదాయం రూ. కోట్లలో సమకూరనుంది. అయితే తక్కువ రేటుకే దక్కించుకునేందుకు లీజుదారులు పావులు కదుపుతున్నారు. తిరిగి పాత లీజుదారులకు కట్టబెట్టేందుకు ఒక్కో షాపునకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ముట్టచెప్పేందుకు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
కొల్లి శారద మార్కెట్ చుట్టూ
కుళ్లు రాజకీయాలు
షాపులు దక్కించుకునేందుకు
ప్రస్తుత లీజుదారుల కుట్ర
వేలం ఆపేందుకు ప్రయత్నాలు
మున్సిపల్ మంత్రి ద్వారా
కమిషనర్కు ఫోన్

మార్కెట్ షాపుల వేలం జరిగేనా?

మార్కెట్ షాపుల వేలం జరిగేనా?