
సహకార సంఘాల అభివృద్ధికి కృషి ముఖ్యం
జిల్లా సహకార అధికారి వెంకటరమణ
నరసరావుపేట: సహకార సంఘాల సమగ్రాభివృద్ధికి కమిటీ సభ్యులు, సీఈఓలు తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులకు సామర్ధ్య నిర్మాణం – సుపరిపాలనపై ఏపీ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీడీసీసీ బ్యాంకులో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ సహకార సంఘాల కమిటీ సభ్యులు, సీఈఓలు సహకార సంఘాలు అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని అన్నారు. విజయవాడ సహకార శిక్షణా కేంద్ర వైస్ ప్రిన్సిపాల్ వేదాంతరెడ్డి మాట్లాడుతూ సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, సరైన పాలనకు మార్గనిర్దేశం చేయడం కమిటీ సభ్యుల ముఖ్యవిధి అన్నారు. జిల్లాలో అన్ని సహకార సంఘాలను ఈ–పీఏసీఎస్గా మార్చి సభ్యులకు డిజిటల్ సేవలు అందిస్తున్నామని, దీనివల్ల సంఘాల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారు. కంప్యూటీకరణ మూలంగా సంఘాల ఆడిట్ సులభం అవుతుందని అన్నారు. శిక్షణలో సహకార సంఘాల పర్సన్ ఇన్ చార్జీలు, సంఘాల సీఇఓలు పాల్గొన్నారు.