
స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వ చేయండి
లక్ష్మీపురం: జిల్లాలో వర్షాకాలంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుంచి వైకుంఠపురం వరకు నావిగేషన్ ఛానల్–4లో ఇసుక తవ్వకాలకు సంబంధించి సర్వే పూర్తి అయిన వెంటనే పెనుమాక, రాయపూడి, వెంకటాయపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెంలో ఇసుక పూడికతీతకు బోట్స్మెన్ సొసైటీకి కేటాయింపుపై సాంకేతిక నివేదికను వారంలో అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. లింగాయపాలెం స్టాక్ పాయింట్ను నిర్వహించిన స్వయం సహాయక సంఘాలకు పెండింగ్లో ఉన్న ఇసుక లిఫ్టింగ్ చార్జీలను తహసీల్దారు నుంచి నివేదిక అందించిన వెంటనే మంజూరు చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లబ్ధిదారుల సర్వే పూర్తి చేయాలి
రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి అందరికీ ఇళ్లు పథకం సర్వేపై సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరైన లబ్ధిదారుల సర్వేను పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి పాల్గొన్నారు.
కౌలు రైతు గుర్తింపు కార్డులపై వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జయలక్ష్మి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు, అన్నదాత సుఖీభవ పథకంపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఏఓ నున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్సీ సమావేశంలో ఇన్చార్జ్
కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ