
అమ్మసన్నిధి.. భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, పెద్ద సంఖ్యలో వివాహాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తులు రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో క్యూలు కిటకిటలాడుతూ కనిపించాయి. మహా మండపం రెండో అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ మరింత పెరగడంతో ఘాట్రోడ్డు పైకి కార్లను అనుమతించలేదు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం 11.40 నుంచి 12.15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. భక్తుల రద్దీ ఉండే సమయాల్లో వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యలో ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలివేశారు. ప్రముఖులు, అధికారుల పేరిట వచ్చిన వారికి ఈవో ఆదేశాలను వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వీఐపీ దర్శనాలకు అనుమతించారు.
టికెటు ఉంటేనే అంతరాలయ దర్శనం
రూ. 500 టికెటు ఉన్న వారికి మాత్రమే అంతరాలయంలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం ఈవో శీనానాయక్ పలుమార్లు టికెట్ల స్కానింగ్, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ప్రముఖుల సిఫార్సులతో దర్శనానికి విచ్చేసిన వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లి టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సమయం కేటాయింపు దిశగా ఈవో చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు నటరాజ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వద్ద సేద తీరగా ఈవో శీనానాయక్ వారిని కలిసి మాట్లాడారు.
దుర్గగుడిలో ఉదయం 11.30 నుంచి వీఐపీ దర్శనాలు నిలిపివేత