
అర్హులైన వైద్యులనే గర్భిణులు సంప్రదించాలి
పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ రవి
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని గర్భిణులు, బాలింతలు వైద్య సేవలకు అర్హులైన వైద్యులనే సంప్రదించాలని, నాటు వైద్యులను సంప్రదించవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా వైద్యుల సలహాల మీరకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం పొందటం వలన మాతాశిశు మరణాలు నియంత్రించవచ్చని అన్నారు. తొమ్మిది నెలల గర్భకాలంలో కనీసం రెండు సార్లు స్కానింగ్ తప్పని సరిగా చేయించాలని సూచించారు. దీని వలన గర్భస్థ శిశువు పెరుగుదల తెలుసుకునేందుకు, జన్యుపరమైన వ్యాధులు, అంగవైకల్యాలు నిర్ధారించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటళ్లలో ఉచితంగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ గురించి ఎటువంటి వాణిజ్య ప్రకటనలు చేయరాదని తెలిపారు. ఈ పరీక్షలు చేసిన వారికి, దానిని ప్రోత్సహించిన వారికీ మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. జిల్లాలో రిజిస్టర్ కాకుండా ఏ హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారన్నారు. ఇటువంటి వారి గురించి తెలిస్తే టోల్ఫ్రీ నంబరు 18004253365 ద్వారా తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మెమో కె.సాంబశివరావు పాల్గొన్నారు.