
అనగనగా ఒక ఊరిలో గంగమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె భర్త ఒక దుకాణంలో పని చేస్తూ ఉండేవాడు. అతను తెచ్చే కొద్ది జీతంతోనే ఆమె గుట్టుగా సంసారాన్ని నడిపేది. ఎవరి దగ్గరా చేయి చాచకుండా లౌక్యంగా పనులు చక్కబెట్టేది.
ఒకసారి వాళ్లింటికి చుట్టాలు వస్తున్నారని కబురు వచ్చింది. ఇంట్లో సరుకులేమీ లేవు. వచ్చినవారికి ఏం వండిపెట్టాలా అని ఆలోచిస్తుండగా డబ్బాలో ఎప్పుడో దాచిన పెసరపప్పు కనిపించింది. వచ్చినవారికి అదే వండి పెట్టాలని అనుకొని బయటకు తీసింది. నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఎండలో ఆరబెట్టింది. కాసేపటికి కొన్ని కాకులు ఆ పప్పును కాళ్లతో తొక్కి, తింటూ ఎంగిలి చేశాయి. గంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తరిమింది. కాకులు ఎంగిలి చేసిన పప్పుతో అతిథులకు వంట వండిపెట్టడం ఆమెకు మనస్కరించలేదు. కానీ ఏదైనా కొందామంటే చేతిలో డబ్బు లేదు. వెంటనే ఓ ఉ΄ాయం ఆలోచించి, ఆ పప్పును మూటగట్టి వీధి చివరున్న ఓ ఇంట్లోకి వెళ్లింది. ఆ ఇంటి ఇల్లాలు చాలా అమాయకురాలని పేరు.
గంగమ్మ ఆమె దగ్గరికి వెళ్లి, తన దగ్గరున్న పప్పు చూపించి ‘నాణ్యమైన పెసరపప్పు. ఇప్పుడే కడిగి ఆరబోశాను. మా ఆయనకు ఇవాళ వేయించిన పప్పు తినాలని ఉందంట. కానీ ఇప్పుడు దీన్ని వేయిస్తే బాగుండదు. దీన్ని నువ్వు తీసుకొని నీ దగ్గరున్న పప్పు ఇస్తావా?’ అని అడిగింది.
అవతలున్న ఇల్లాలు చాలా సంతోషించింది. ‘హయ్యో! ఈ గంగమ్మ ఎంత పిచ్చిది! కడిగి, ఆరబెట్టిన పప్పు ఇచ్చి దుమ్ముతో ఉండే పప్పు అడుగుతోంది’ అని అనుకొని ఆ పప్పు తీసుకొని తన దగ్గరున్న పప్పు గంగమ్మకు ఇచ్చి పంపింది. ఇదంతా ఇంట్లో నుంచి వాళ్లాయన గమనించాడు.
భార్యను పిలిచి, ‘పిచ్చిదానా! శుభ్రమైన పప్పును మనకు ఇచ్చి, మన దగ్గరున్న పప్పు అడగటానికి గంగమ్మ అంత తెలివితక్కువ మనిషి కాదు. ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు. ఈ పప్పులో ఏదో దోషం ఉండి ఉంటుంది. దాన్ని పారేయ్’ అని చెప్పాడు. ఆయన భార్య ‘అయ్యో’ అనుకుంటూ ఆ పెసరపప్పును పారేసింది.
నీతి: ఎవరూ ఏదీ మనకు ఊరికే ఇవ్వరు. అలా ఇస్తే అందులోని ఆలోచనను గుర్తించాలి.