
నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తమ ప్రాంగణాలను పచ్చగా మార్చేందుకు శ్రద్ధ చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జపనీస్ టెక్నిక్ అయిన మియావాకీ అత్యుత్తమ అనుసరణీయ విధానంగా మారింది. గత ఐదేళ్లుగా ఈ విధానం ఊపందుకోవడంతో నగరం నలుదిశలా ఇప్పుడు పచ్చగా ప్రతిఫలిస్తున్నాయి. ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు వాతావరణంలో ఏర్పడుతున్న సమతుల్యత వెరసి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చదనం ఆవశ్యకతపై అవగాహన పెరుగుతోంది.. దీంతో విస్తారంగా మియావాకీ అడవుల పెరుగుదలకు దోహదపడుతోంది.
తనను తాను పోషించుకునే, పెంపొందించుకునే సత్తా ఉన్న మియావాకీకి స్వల్పకాలం మాత్రమే పోషణ అవసరం. దీంతో పచ్చని ప్రదేశాలను విస్తరణ కోసం మియావాకీ అటవీకరణ విధానం ప్రస్తుతం విస్తృతంగా ఆదరణ పొందుతోంది. జపనీస్ వృక్ష శాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ అభివృద్ధి చేసిన డెన్స్ నేటివ్ మినీ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఈ విధానంలో భాగంగా ఒక చిన్న ప్రాంతంలో వివిధ రకాల స్థానిక చెట్ల జాతులను దగ్గరగా నాటడం జరుగుతోంది. ఫలితంగా దట్టమైన, వేగంగా పెరిగే అడవులు ఏర్పడనున్నాయి. దీనిని విజయవంతంగా అనుసరిస్తూ నగరంతో పాటు చుట్టుపక్కల అనేక మియావాకీ అడవులు పచ్చగా వరి్థల్లుతున్నాయి.
జయహో గ్రీనరీ..
ప్రభుత్వ హరితహారం కార్యక్రమంతో పాటు, పెద్ద ఎత్తున అటవీకరణ ప్రాజెక్టుల కోసం అనేక ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు మియావాకీ పద్ధతిని అవలంభిస్తున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఉన్నటువంటి పలు కంపెనీలు మియావాకీ తోటల పెంపకంలో తాము కూడా పాల్గొంటున్నాయి.
ప్రముఖ బయోఫిలిక్ డెవలపర్ ఎకో–రియాల్టీ ఫర్మ్గా పేర్కొంటున్న స్టార్టప్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్, ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అటవీప్రాంతాన్ని శంషాబాద్లో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని అదనంగా 100 ఎకరాల్లో విస్తరించనున్నారు.
రాచకొండ పోలీసులు 40,000 మొక్కలతో మియావాకీ తోటను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు దట్టమైన అడవిగా పెరిగింది.
కొత్తపేటలో 10 ఎకరాల మియావాకీ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వే కాలనీలోనూ ఈ పద్ధతిలో మొక్కలు నాటారు.. దీనిలో సే ట్రీస్ ఎరాన్మెంటల్ ట్రస్ట్ అనే ఎన్జీఓ కూడా భాగం పంచుకుంది.
హైదరాబాద్ యూనివర్సిటీలో 4వేల మొక్కలతో మినీ ఫారెస్ట్ను సృష్టించారు.
రెండేళ్లలో స్వయం పోషకంగా..
వ్యక్తిగత ఆసక్తితో బెంగళూరులో దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 15 ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్నాను. మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఇవి స్వయం పోషకాలుగా మారతాయి.
ఆ తర్వాత వాటి పరిరక్షణకు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ విధానానికి తగినట్టుగా మొక్కలు పెంచే స్థలంలో పలు రకాల మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాగే ఈ విధానంలో తొలి దశలో వ్యయప్రయాసలు కూడా ఎక్కువే ఉంటాయి.
– మహేష్ తలారి, ఎన్జీఓ ఎవర్గ్రీన్ ఎగెయిన్, మియావాకీ నిపుణులు
మియావాకీ విశేషాలు..
మియావాకీ పద్ధతి తక్కువ సమయంలో దట్టమైన అడవులను సృష్టించగలదు. ఈ విధానంలో చెట్లు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి అంతేకాక ఈ అడవి సంప్రదాయకంగా నాటిన అడవుల కంటే 30 రెట్లు దట్టంగా ఉంటాయి. ఈ చిన్న అడవులు వివిధ జాతుల పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర వన్యప్రాణులను ఆకర్షించడానికి జీవవైవిధ్యానికి దోహదం చేస్తాయి. ప్రధాన మియావాకీ సూత్రాలను అనుసరిస్తూ స్థానిక నేల వృక్షజాతులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తున్నారు.