అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే న్యాయసేవాధికార సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు
ఇటుక బట్టీల్లో రెస్క్యూ ఆపరేషన్ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది
474 మంది వెట్టిచాకిరి బాధితులను వాళ్ల స్వస్థలాలకు పంపించాం
ప్రభుత్వ భూముల్లోనే ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వైనం జిల్లా న్యాయసేవాధికార సంస్థ
చైర్పర్సన్, జిల్లా జడ్జి భారతలక్ష్మితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
ప్రస్తుత కాలంలో వెట్టిచాకిరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని ఇటుక బట్టీల్లో భారతలక్ష్మి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 474 మంది వెట్టిచాకిరి కార్మికులకు విముక్తి కల్పించారు. ఈ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి మాదిరిగా నిషేధిత వెట్టిచాకిరి చేయించే పరిస్థితులు ఇప్పుడు ఉండటం విచారకరం. అలాంటి వ్యవహారాలు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే. జిల్లా కేంద్రానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఆలూర్ మండలం దేగాం, ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామాల్లో ప్రధాన రహ దారి పక్కనే ఇటుక బట్టీల్లో నీటి, వసతి, మరెలాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులను నిర్బంధించి పని చేయిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తాజా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాం. ఇటుక బట్టీల నిర్వాహకులతో స్థానిక పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు మిలాఖత్ కావడంతో ఎవరికీ చెప్పకుండా ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
రేకుల గదుల్లో బంధించేవారు..
ఇటుక బట్టీల్లో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనులు చేయిస్తున్నారు. కార్మికులు పారిపోకుండా ఉండేందుకు గాను వారి పిల్లలను గాలి, వెలుతురు లేని ఇరుకై న రేకుల గదుల్లో బంధించారు. తాగునీరు లేదు. తగిన ఆవాసం లేకపోవడంతో ప్లాస్టిక్ కవర్ల డేరాల్లో ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులను పిల్లలతో పడుకోన్విరు. పైగా క మ్యూనికేషన్ లేకుండా ఫోన్లు లాక్కున్నారు. ఆధార్ కార్డులు తీసుకున్నారు. పిల్లలతో పనులు చేయిస్తున్నారు. చిన్నారులకు విద్య సౌకర్యం లేదు. పెద్దల కు, పిల్లలకు వైద్యం చేయించరు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ పనులు చేయిస్తున్నారు. ఆస్పత్రికి వెళి తే నిఘా పెడుతున్నారు. పిల్లలతో పనులు చేయించి వారానికి కేవలం రూ.500 మాత్రమే ఇస్తున్నారు.
రక్తం వచ్చేలా కొట్టేవారు..
భార్యాభర్తలు కలిసి రోజుకు 2 వేల ఇటుకలు తయారు చేస్తే వారానికి రూ.3 వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు. ఐదు రోజుల బాలింతతో సైతం పనులు చేయించారు. గత ఐదేళ్లుగా తమ పిల్లలను తమ గ్రామాల్లోని బంధువులు చూడలేదని కార్మికులు ఆవేదన చెందారు. వాలి, కల్పన, అంజయ్య, వెంకటేష్ అనే మేసీ్త్రలు తమను రక్తం వచ్చేలా కొట్టేవారని బాధిత కార్మికులు చెప్పడం బాధ కలిగించింది.
- ప్రతివారం ఒక మహిళ వస్తే ఆమె వద్ద మాత్రమే కూరగాయలు, సరుకులు కొనాల్సిన పరిస్థితి కల్పించారు. స్థానిక పోలీసులతో యాజమాన్యాలకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏమీ చేయలేక కార్మికులు భయపడ్డారు. ఇక ఇటుక బట్టీల్లో పనులు లేని సమయంలో సమీప పొలాల్లో పనులు చేయించి ఆ వచ్చిన డబ్బులను ఇటుక బట్టీల నిర్వాహకులే తీసుకునేవారు.
పిల్లలను చంపేస్తామని బెదిరింపులు..
పనులు చేయకుండా పారిపోతే పిల్లలను చంపేస్తామని బెదిరించారు. ఇప్పటికీ ఆ బట్టీల్లో నలుగురు మరణించారు. మరణించివాళ్లలో ఒక బాలుడు ఉన్నాడు. మరణించిన వాళ్ల మృతదేహాలు ఏమి చేశారో కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. అన్ని అంశాలపై పూర్తి వివరాల కోసం తహసీల్దారును విచారణకు ఆదేశించాం. ఎలాంటి విషయంలోనైనా సరే బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదులు చేయవచ్చు. ఇప్పటికే జిల్లాలో అనేక వీడీసీల బాధితుల సమస్యలు పరిష్కరించాం.
కార్మికులకు విముక్తి కల్పించడం సంతోషంగా ఉంది..
రెస్క్యూ ఆపరేషన్ చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 474 మందిని విముక్తం చేయడం సంతోషంగా ఉంది. ఈ ఆపరేషన్ రెస్క్యూను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. వందల మందికి వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించడం చాలా సంతృప్తినిచ్చింది. బాధితులందరినీ ఆర్మూర్కు తరలించి పూర్తి వివరాలు సేకరించి, కలెక్టర్ సహకారంతో ప్రత్యేకంగా ఏడు ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలించాం. ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలకు పూర్తి వివరాలు పంపించి వీళ్ల పునరావాసం కోసం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
మూడు ఇటుక బట్టీల్లో వెట్టి నుంచి బాధితులను విముక్తి చేయడంతో మరో ఇటుక బట్టీ నుంచి మరో 150 మంది కార్మికులు బయటకు వచ్చారు. జిల్లాలోని మిగిలిన ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరి చేస్తున్న వారిని సైతం వాళ్ల స్వస్థలాలకు పంపిస్తాం. 20 మందికి కార్మిక శాఖ నుంచి లైసెన్సులు తీసుకుని వందలు, వేలమందితో పనులు చేయిస్తుండడం దారుణం. ఇదిలా ఉండగా ఒక సర్వే నంబరులోని పట్టా భూముల్లో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లో బట్టీలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వీటిపై దృష్టి సారించాల్సి ఉంది.
More than 400 workers including over 100 children rescued from three #brickkiln units in #Telangana's Siddapur village, Nandipet mandal, Nizamabad district; operation led by Principal District Judge Bharath Laxmi following directions from State Legal Services Authority; this… pic.twitter.com/MnRt9LRoiW
— Uma Sudhir (@umasudhir) May 21, 2026


