● భక్తులకు మెరుగైన దర్శనం, సేవలు అందిస్తున్న దేవస్థానాల్లో శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంక్
● వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేల్లో వెల్లడి
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుద్ధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకాతిరుమల దేవస్థానం, ఈనెల 16న వెలువడిన జూన్ నెలకు సంబంధించిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే ఈసారి దర్శనం ఇతర అన్ని అంశాల్లో శ్రీకాళహస్తి దేవస్థానం మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీశైలం దేవస్థానం ఆఖరి స్థానంలో నిలిచింది.
దర్శనం ఇతర అంశాల్లో.. శ్రీకాళహస్తి 75.8 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, ద్వారకాతిరుమల 74.2 శాతంతో రెండవ ర్యాంక్, అన్నవరం 73.0 శాతంతో మూడవ ర్యాంక్, సింహాచలం 72.6 శాతంతో నాల్గవ ర్యాంక్, కాణిపాకం 72.0 శాతంతో ఐదవ ర్యాంక్, విజయవాడ 71.2 శాతంతో ఆరవ ర్యాంక్ సాధించగా, శ్రీశైలం 68.8 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది.
సౌకర్యాల కల్పనలో..
శ్రీకాళహస్తి 75.75 శాతంతో మొదటి ర్యాంక్, ద్వారకాతిరుమల 74.21 శాతంతో రెండవ ర్యాంక్, అన్నవరం 73.0 శాతంతో మూడవ ర్యాంక్, సింహాచలం 72.61 శాతంతో నాల్గవ ర్యాంక్, కాణిపాకం 71.97 శాతంతో ఐదవ ర్యాంక్, విజయవాడ 71.16 శాతంతో ఆరవ ర్యాంక్, శ్రీశైలం 68.80 శాతంతో ఏడవ (ఆఖరి) ర్యాంక్ సాధించింది.


