ఏలూరు (ఆర్ఆర్పేట): ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ.. తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న డీఏలను విడుదల చేయాలని, గత ప్రభుత్వం నుంచి నిలిచిపోయిన సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ సొమ్మును ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు వారికి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత (క్యాష్లెస్) వైద్యం అందేలా చూడాలన్నారు. కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ఆర్టీఎస్ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను సకాలంలో అందించాలని కోరారు. దీంతో పాటు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టరుకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్. హరనాథ్, ఏలూరు తాలుకా అధ్యక్షుడు గొన్నూరి శ్రీధర్ రాజు, కార్యదర్శి గంటా చంద్రశేఖర్, జిల్లాకోశాధికారి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి
12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి, ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ కే.రమేష్ కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాయకులు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, సెక్రెటరి, ఏ.ప్రమోద్ కుమార్, ఉమెన్ వింగ్ చైర్పర్సన్ గీతిక, జనరల్ సెక్రటరీ భషీర్ తదితరులు పాల్గొన్నారు.


