నరసాపురం రూరల్ : చదవాలనే తపన, పట్టుదల ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డురాదని నరసాపురం పట్టణం కోవెల వీధికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బొప్పన నాగమల్లేశ్వరరావు నిరూపించారు. ఇటీవల ఎల్ఐసీలో బ్రాంచ్ మేనేజర్గా ఉద్యోగ విరమణ పొందిన ఆయన మొదటి నుంచి తనకు ఎంతో ఆసక్తి ఉన్న న్యాయవాద వృత్తిని చేపట్టాలని బలమైన కాంక్షతో ముందడుగు వేశారు. గతంలో ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో ప్రైవేటుగా న్యాయ విద్యను అభ్యసించే అవకాశం లేకపోవడంతో, పదవీ విరమణ తర్వాత తన సుదీర్ఘకాలపు కోరికను నెరవేర్చుకోవాలని 2026–27 విద్యాసంవత్సరానికి గాను మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ లాసెట్ పరీక్షలు రాశారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో ఆయన వందకు వంద మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమంగా 9వ ర్యాంకు కై వసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించిన విషయం తెలుసుకున్న పలువురు ఎల్ఐసీ ఏజెంట్లు, మిత్రులు బుధవారం నరసాపురంలోని నాగమల్లేశ్వరరావు నివాసానికి వచ్చి, ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.


