కాళ్ల: ఆకివీడు జవహర్ పేటలో ఈ నెల 9న జరిగిన చోరీ కేసును ఛేదించినట్లు ఆకివీడు సీఐ కాళీ చరణ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దింటి శ్రీను కుటుంబ సభ్యులు పెళ్లి బట్టలు కొనుగోలు నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారించామని పేర్కొన్నారు. ఈ కేసులో ఆకివీడు గంగానమ్మకోడు ప్రాంతానికి చెందిన మేకల తేజ, సాయి నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరూక్లను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.17 లక్షలు విలువైన 14.5 కాసుల బంగారు నగలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా వీరు రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఆయన చెప్పారు. నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఎస్సై హనుమంత నాగరాజు, కానిస్టేబుల్ శివ, విజయ్, వాసు, నాగేశ్వరరావు తదితరులను ఆయన అభినందించారు.


