న్యూస్రీల్
ఇంటిపై దాడికి యత్నిస్తే కేసు లేదు. ఇంటి ముందు వందల మంది అనుచరులతో, జేసీబీతో నానా హడావుడి చేసి వాడో.. నేనో తేలిపోవాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రజాప్రతినిధి వీరంగమాడినా పోలీసులు పట్టించుకోరు. కనీసం మొక్కుబడిగానైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా రివర్స్లో న్యాయవాదిపైనే కేసులు నమోదు చేశారు. అది కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. మరో ఫిర్యాదు పెండింగ్లో ఉంది. రోజంతా స్టేషన్లో ఉంచి బైండోవర్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై పంపారు. ఇదంతా ప్రజాప్రతినిధిని సంతృప్తి పరచడానికి ఏలూరు పోలీస్ యంత్రాంగం చేసిన హడావుడి.
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసరావు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య కొద్ది నెలలుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. మద్యంలో ప్రజాప్రతినిధి దోపిడీ చేస్తున్న వ్యవహారం, ఇసుక, గ్రావెల్, దౌర్జన్యకాండపై ఇటీవల విలేకరుల సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలను, కొన్ని ఆధారాలను న్యాయవాది శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ పరిణామాల క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరగణంతో, జేసీబీ వాహనంతో ఏలూరు అమీనాపేటలోని న్యాయవాది నివాసాన్ని కూల్చివేస్తానంటూ స్వయంగా వెళ్లి హడావుడి చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఇంటి గేటును పగులకొట్టి మరీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రామా అనంతరం ఏలూరు పోలీసులు చింతమనేనిని ఇంటి వద్ద దింపి బాధితుడిగా ఉన్న న్యాయవాది శ్రీనివాస్కు 151 నోటీసు జారీ చేసి అతని కుమారుడితో సహా మహిళా పోలీస్స్టేషన్కు ఆదివారం అర్ధరాత్రి తరలించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు మహిళా పోలీస్స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. న్యాయవాది అక్రమ నిర్బంధంపై ఏలూరు బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదులు నిరసన తెలిపారు. అనంతరం న్యాయవాదులు జిల్లా కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ దాఖలు చేసి న్యాయమూర్తి దృష్టికి ఘటనను తీసుకువెళ్ళిన క్రమంలో న్యాయమూర్తి అడ్వకేట్ కమిషనర్ ఏర్పాటు చేయడంతో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
న్యాయవాదిపై అట్రాసిటీ కేసు నమోదు
న్యాయవాదిని వేధించడమే లక్ష్యంగా పచ్చనేతలు పోలీసులను అడ్డంపెట్టుకుని హడావుడికి తెరతీశారు. ఈ నెల 10న ఏలూరు రూరల్ మండల టీడీపీ నాయకుడు నేతల రవి జిల్లా కోర్టుకు వెళ్తే న్యాయవాది శ్రీనివాసరావు ఎదురుపడి కులం పేరుతో దూషించి అసభ్యంగా మాట్లాడారని సోమవారం ఫిర్యాదు చేయడం, వెంటనే ఏలూరు త్రీటౌన్ పోలీసులు హడావుడిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏలూరు టూటౌన్లో మరో కేసు నమోదు చేశారు. టీడీపీ మహిళా నేతలు తమను, తమ ప్రజాప్రతినిధి కుటుంబాన్ని అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. మంగళవారం సాయంత్రం న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఏలూరు టూటౌన్ పోలీసులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దౌర్జన్యం చేసి గేటును పగులకొట్టి దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు చేయగా పోలీసులు ఫిర్యాదు స్వీకరించి రసీదు అందచేశారు.
ఇంటిపై దాడికి యత్నిస్తే నో కేస్
బాధితుడైన న్యాయవాదిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఏలూరు టూటౌన్లో బైండోవర్ కేసు
చింతమనేనిపై కేసు నమోదు చేయాలని న్యాయవాది ఫిర్యాదు
ఏకపక్షంగా ఏలూరు పోలీసుల తీరు


