ఏలూరు టౌన్: న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబును ఏలూరు జిల్లా న్యాయస్థానం నియమించిన అడ్వకేట్ కమిషనర్ సురేష్రెడ్డి సమక్షంలో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్ళారు. న్యాయవాది శ్రీనివాసబాబుపై నమోదు చేసిన కేసుల్లో స్టేషన్ బెయిల్కు అవకాశం ఉండటంతో ఆయన్ను ఏలూరు జిల్లా కోర్టుకు తరలించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అమీనాపేటలోని న్యాయవాది శ్రీనివాసబాబు ఇంటివద్దకు వెళ్ళి హంగామా చేశారు. మద్యం సేవించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో టూటౌన్ పోలీస్స్టేషన్లో బైండోవర్ కేసు నమోదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చింతమనేనిని హౌస్ అరెస్ట్ చేశారు. న్యాయవాది శ్రీనివాసబాబుపై దెందులూరు నియోజకవర్గానికి చెందిన నలుగురు పార్టీ నాయకులు ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న శ్రీనివాసబాబు ప్రెస్మీట్ పెట్టి ఎమ్మెల్యే చింతమనేని, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మహిళల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతూ కించపరిచారనీ అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


