ఏలూరు (టూటౌన్): జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో ఏలూరు కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా బంగారాన్ని మాకు ఇప్పించండి అంటూ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులు, అనేక మంది జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తమ బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఆ బంగారం స్థానంలో ఇనుప వస్తువులు, సుద్ద ముక్కలు ఉన్నాయన్నారు. తప్పుడు పత్రాలు చూపిస్తూ బ్యాంకు అధికారులే దొంగతనం చేశారని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు మాట్లాడుతూ బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని ప్రకటించారు. ధర్నా అనంతరం గోల్డ్ లోన్ బాధితులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఎం నాయకులు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ వెట్రిసెల్వి స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ హామీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ను ఆదేశించారు. కార్యక్రమంలో గోల్డ్ లోన్ బాధితులు కొప్పుల సత్తిరెడ్డి, గెడా ఆనంద ప్రసాద్, తలారి నందిని, ఆర్.దుర్గాభవాని, గోలి కృష్ణారెడ్డి, కోనా రాము తదితరులు పాల్గొన్నారు.


