బుట్టాయగూడెం: గోదావరి అందాలు, పాపికొండల ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు ప్రతి వారాంతరంలో అధిక సంఖ్యలో పర్యాటకులు దేవీపట్నం, రాజమండ్రి పరిసర ప్రాంతాలకు తరలి వస్తుంటారు. దేవీపట్నం, గండిపోచమ్మ అమ్మవారి గుడి వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు పాయింట్ నుంచి పాపికొండల విహారయాత్రకు బయల్దేరి వెళ్తుంటారు. అయితే ఈసారి పాపికొండల విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్న వారందరికీ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాపికొండల పర్యాటక బోటు ప్రయాణాలు ఆదివారం తా త్కాలికంగా నిలిచిపోయాయి. శుక్రవారం గండిపోచమ్మ బోటు పాయింట్ నుంచి రెండు బోట్లలో పర్యాటకులు పాపికొండల అందాలను వీక్షించేందుకు 89 మంది ప్రయాణికులతో బయలుదేరగా.. బోటు దేవీపట్నం పాత పోలీస్స్టేషన్ సమీపానికి వెళ్లే సరికి సాంకేతికలోపం తలెత్తడంతో గోదావరి నడి మధ్యలోనే నిలిచిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు కేకలు పెట్టారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కంట్రోల్రూమ్ అధికారులకు, బోటు యజమానులకు సమాచారం అందించారు. దీంతో నిర్వాహకులు మరో బోటును ఏర్పాటు చేసి ప్రయాణిలను సురక్షితంగా పంపించారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పర్యాటకశాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిట్నెస్ ఉంటేనే..
పాపికొండల పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై ఆరోపణలు రావడంతో బోటు ప్రయాణాన్ని నిలిపివేసిన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక ఏపీ టూరిజం, 15 ప్రైవేటు బోట్లు నిలిచిపోయాయి. బోట్ల నిర్వహణ, భద్రతను పరిశీలించిన తర్వాత ఫిట్నెస్గా ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. అనంతరమే పాపికొండల పర్యాటకానికి అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే బోట్ల తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాకే బోటు ప్రయాణాలు ప్రారంభమవుతాయని, అప్పటివరకూ పర్యాటకులు తమ ప్రయా ణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గోదావరిపై బోటు ప్రయాణానికి తాత్కాలిక బ్రేక్
పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై తనిఖీలు
15 ప్రైవేట్, ఒక టూరిజం శాఖ బోట్ల నిలిపివేత


