పెనుగొండ: మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపు లక్ష్యంగా పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జరిగిన టెంపుల్ యోగాలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. యోగా గురువు, నేషనల్ అథ్లెటిక్స్ యోగా టీచర్ బడుగు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతో సాధ్యమన్నారు. యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని, సంపూర్ణ జీవన విధానమన్నారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు యోగా కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం అభినందనీయమన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీఓ దాసి రాజు, జిల్లా ఆయుష్ అధికారి ఎ.శ్రీరామ్, తహసీల్దార్ జి.అనితకుమారి, ఆయుష్ వైద్యులు శాస్త్రి ఆకేళ్ల, ఎన్.గిరీష్, ఎన్.మల్లేశ్వరి, సీహెచ్ సులక్షణ, రామచంద్ర, కిషోర్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


