కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ నీ ఆశీస్సులు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు భక్తులతో కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం మాత్రమే ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,05,567 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
వేలేరుపాడు: మండలంలోని రుద్రంకోట సమీపంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగిన కంతిరెడ్డి రాంబాబు (25) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వేలేరుపాడు పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులు స్థానికుల సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రాంబాబు గల్లంతుంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలముకున్నాయి. రాంబాబు వైఎస్సార్సీపీ కార్యకర్త. ఈ ప్రమాద వార్త తెలియడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాంబాబు ఉదంతంపై వేలేరుపాడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కేశగాని శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కామినేని వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు గుద్దేటి భాస్కర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


