భీమవరం (ప్రకాశంచౌక్): సమాజం పట్ల బాధ్యతతో, సేవా దృక్పథంతో నిర్వహించే ప్రజోపయోగ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం నుంచి ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ప్రపంచంలో డబ్బుతో కొనలేని విలువైనది రక్తం మాత్రమేనని, స్వచ్ఛంద రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాలులో ఆర్.ఆర్.ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని దానాల్లోకెల్లా రక్తదానం అత్యంత గొప్పదని, రక్తదానం నిజమైన ప్రాణదానమని పేర్కొన్నారు. కలెక్టర్ తనయుడు చదలవాడ భరత్ చంద్ర మాట్లాడుతూ, రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఆయన స్వయంగా రక్తదానం చేశారు. భీమవరం రెండో పట్టణ సర్కిల్ ఇనన్స్పెక్టర్ మురళీకష్ణ, పోలీస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మోజెస్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు, ఆర్.ఆర్.ఫ్రెండ్స్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఆనంద రఘువర్మ, అధ్యక్షుడు గెడ్డం రామారావు తదితరులు పాల్గొన్నారు.


