ఏలూరు టౌన్: ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కేఎండీ అబుతాలిబ్ పర్వేజ్ తీర్పు చెప్పారు. ఏలూరు కత్తేపువీధి సెంటర్లో 2020 డిసెంబర్ 25న రాత్రి 9గంటల సమయంలో జూపూడి సుకుమార్ తన స్నేహితులతో మాట్లాడుతన్నాడు. అదే సమయంలో కత్తేపువీధి సీఎస్ఐ చర్చి ప్రాంతానికి చెందిన బండ్లమూడి నవీన్ ఆకస్మికంగా వెనుకవైపు నుంచి వచ్చి బ్లేడుతో సుకుమార్ మెడపై దాడి చేశాడు. బాధితుడు మరుసటి రోజు ఏలూరు వన్టౌన్ ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కేఎండీ అబుతాలిబ్ పర్వేజ్ విచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరపున సహాయ ప్రభుత్వ న్యాయవాది హేమలత సాక్షాధారాలను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి నవీన్ నేరం రుజువు కావటంతో ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పర్వేజ్ తీర్పు ఇచ్చారు. ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఎస్సైలు సుధాకర్, రామకృష్ణ, దుర్గాప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ హరికిషోర్ సాక్షులను కోర్టులో హాజరుపరిచారు.
భీమవరం: అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతిచెందినట్లు భీమవరం వన్టౌన్ ఎస్సై ఎస్వీవీ కృష్ణాజీ మంగళవారం చెప్పారు. ఒరిస్సా రాష్ట్రం కాండ్రపడ జిల్లా రాధానాగ్కు చెందిన యాదాపు స్వయమ్ (35) మరొక ముగ్గురు భీమవరం ఎల్అండ్టీ కంపెనీలో పనిచేయడానికి ఈనెల 17వ తేదీన వచ్చారు. తాడేరు రోడ్డులోని మద్యం షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి రెండు రోజులపాటు అతిగా మద్యం సేవించడంతో మంగళవారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణాజీ చెప్పారు.


