తాడేపల్లిగూడెం: తేనెటీగల పెంపకంతో రైతులు అధిక ఆదాయాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో హనీబీ న్యూక్లియస్ కేంద్రం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఉద్యానవర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరెడ్డి మాట్లాడుతూ జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో న్యూక్లియస్ స్టాకు కేంద్రం ప్రారంభమైందన్నారు. ఎన్బీహెచ్ఎం పథకం కింద వెంకట్రామన్నగూడెం కేవీకేకు రూ.92.728 లక్షల నిధులు మంజూరు కాగా, తొలి విడతలో 43.99 లక్షలతో తేనెటీగల పెంపకంపై రైతులు, గ్రామీణ యువత, మహిళలకు శాసీ్త్రయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మూడు బ్యాచ్లలో మొత్తం 75 మందికి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కేవికెలో న్యూక్లియస్ కల్చర్ యూనిట్ను ఏర్పాటుచేసి 75 శాతం రాయితీపై 425 తేనెటీగల పెట్టెలు, తేనె సేకరణ యంత్రాలు , 24 రకాల అనుబంధ పరికరాలను రైతులకు అందజేశారు. వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ రూత్, రిజిస్ట్రార్ ఎం.మాధవి, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ బి.ప్రసన్నకుమార్, పరిశోధన సంచాలకులు జి.రామానందం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్.విజయ పద్మ, అసోసియేట్ డీన్ ఎన్బీవీ, చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్తలు టి.సుశీల, ఈ.పద్మ, ఎన్.ఇమ్మానుయేల్, కేవీకే సమన్వయకర్త కిరణ్కుమార్ పాల్గొన్నారు.


