ఏలూరు (ఆర్ఆర్పేట): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వచ్చే జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ నిర్వహించే ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి సూచించారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుందని తెలిపారు. తదుపరి అభ్యంతర సేకరణ కార్యక్రమం జూన్ 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. అనంతరం సెప్టెంబరు 22వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారని తెలిపారు. జూన్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ బూత్ లెవల్ ఏజెంట్లకు ఓరియంటేషన్ వర్కు షాప్లు ఈఆర్వోస్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణనను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఈనెల 25వ తేదీలోగా జిల్లా స్థాయిలో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేయాలని, ఖాళీగా ఉన్న సూపర్వైజర్లు, బీఎల్వో పోస్టుల వివరాలపై నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎల్. దేవకీదేవి, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోర్, జెడ్పీ సీఈవో పీ జగదాంబ, ఏపీ ఐఐసీ జోనల్ మేనేజరు కే బాబ్జీ, తహసీల్దార్లు పాల్గొన్నారు.


