ద్వారకాతిరుమల: రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేకె త్తించిన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్కు సంబంధించిన కేసులో ఇప్పటివరకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఆలయ చరిత్రలోనే ఈ స్కామ్ అతి పెద్దదిగా చెబుతున్నారు. దేవస్థానం సాఫ్ట్వేర్కు సమాంతరంగా మరో సాఫ్ట్వేర్ను త యారు చేసి, స్కామ్కు పాల్పడ్డ వారిని పోలీస్ ఉన్నతాధికారులు ఉపేక్షించడం లేదు. అందుకే లోతైన విచారణ జరిపేందుకు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న నిందితుల్లో ఐదుగురిని భీమడోలు సీఐ (విచారణ అధికారి) పి.కృష్ణ పోలీస్ కస్టడీకి కోరేందుకు సిద్ధమయ్యారు. దీంతో దేవస్థానంలో కొందరు ఉ ద్యోగుల వెన్నులో వణుకు మొదలైంది. అంతా అయిపోయిందని ఊపిరి పీల్చుకున్న కొందరు మళ్లీ కథ మొదటికొచ్చిందని తలలు పట్టుకుంటున్నారు.
కస్టడీకి పిటీషన్
కేసులో ఏ–1 ఐఎస్జే రాజు, ఏ–2 ఎం.రమేష్, ఏ–3 ఎస్.శేషుబాబు, ఏ–4 మేకా సతీష్, ఏ–5 టి.సత్యనారాయణ ను పోలీస్ కస్టడీకి కోరుతూ సీఐ కృష్ణ సోమవారం భీమడోలు కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో లోతైన విచారణ జరిపితే మరికొందరు బయటపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
వారమైనా చర్యల్లేవు
నకిలీ టికెట్ల వ్యవహారంపై గత నెలలోనే దేవస్థానం డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ నిర్వహించింది. విచార ణాధికారిగా ఈఈ డీవీ భాస్కర్, ప్రజెంటింగ్ అధికారిగా ఏఈఓ ఎంఎస్ఎల్ వాసు, అసిస్టెంట్ ప్రజెంటింగ్ అధికారిగా సూపరింటెండెంట్ ఐవీ రామారావు వ్యవహరించారు. వీరు దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని విచారించారు. అధికారులు, సిబ్బంది జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తించలేదని తేల్చి నివేదికను ఈనెల 6న ఆలయ ఈఓ వై.భద్రాజీకి సమర్పించారు.
మొదటి నుంచి తాత్సారమే..
టికెట్ల స్కామ్ గతనెల 15న వెలుగులోకి వచ్చింది. అదేరోజు ఈఓ భద్రాజీ స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యా దు చేశారు. అయినా డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ వేయడంలో తాత్సారం చేశారు. వారం తర్వాత ఎంక్వయిరీ వేయగా.. విచారణ చేపట్టిన అధికారులు నివేదిక సమర్పించి వారం గడిచినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
నకిలీ టికెట్ల స్కామ్లో ఐదుగురిని కస్టడీకి కోరనున్న సీఐ
లోతైన విచారణతో మరికొందరి పాత్ర బయటపడే అవకాశం
కొందరు ఉద్యోగుల్లో మొదలైన వణుకు


