ఏలూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం
ఏలూరు టౌన్ : ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఈగల్, ఏలూరు పోలీస్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఏలూరు రైల్వే స్టేషన్లో ఒడిస్సా నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు చేశారు. అలప్పుజా ఎక్స్ప్రెస్ రైలులో సుమారు 18 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై నిఘా ఉంచామని ఈగల్ ఆర్ఎస్ఐ బీ.ఉదయ్ భాస్కర్, ఏలూరు వన్టౌన్ ఎస్ఐ సీహెచ్కే దుర్గాప్రసాద్ తెలిపారు. ఇటీవల రైళ్లలో గంజాయిని రవాణా చేస్తూ ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు తరలిస్తున్న నేపథ్యంలో పటిష్టమైన నిఘా ఉంచామన్నారు.
చాట్రాయి: దళారుల చేతిలో మూగజీవాలు నలిగిపోతున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేసిన పశువులను వ్యానుల్లో స్థాయికి మించి ఎక్కించడంతో ఒకదానిపై మరొకటి పడి నలిగిపోతున్నాయి. బుధవారం మండలంలోని చనుబండ వ్యవసాయ మార్కెట్ వద్ద ఆగిన వ్యానులో ఒక దానిపై ఒకటి పడి ఉన్న మూడు గేదేలను చూసి స్థానికులు చలించిపోయారు. అయ్యో పాపం పశువులు ఊపిరాడక నలిగిపోతున్నా యంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
దెందులూరు: తాళాలు వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాధవి దాబా హోటల్ను నిర్వహిస్తుంది. ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులంతా ఇతర గ్రామానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా 24 కాసుల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై బాధితులు గురువారం దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివాజీ చెప్పారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలులో ఒక రౌడీషీటర్పై కొందరు ఖైదీలు దాడి చేశారు. గాయాలపాలైన రౌడీషీటర్ను చికిత్స నిమిత్తం ఏలూరు జీజీహెచ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు టూటౌన్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ పులిగడ్డ జగదీష్ ఇటీవల ఏలూరు 12 పంపుల సెంటర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఒక యువతిని ఇంటిలో నుంచి లాక్కుని వార్డు సచివాలయానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఏలూరు టూటౌన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో జగదీస్ జైలులోని బ్యారక్ వద్ద బాత్రూమ్లోకి వెళ్తుండగా పలు చోరీ కేసుల్లో నిందితులైన దుర్గాప్రసాద్, గుత్తుల రవికుమార్, పోలవరపు నాగదుర్గాప్రసాద్ ముగ్గురూ కలిసి అతడిపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయాలైన జగదీష్ను జైలు సిబ్బంది ఏలూరు జీజీహెచ్కు చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. జైలర్ రమేష్ ఫిర్యాదుతో ఏలూరు వన్టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం


