పాలకొల్లు సెంట్రల్: స్థానిక పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి పురస్కరించుకుని రుద్రహోమం శాస్త్రోకంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తులు గోపూజ, స్వామివారికి అభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు, అనంతరం రుద్రహోమం చేశారు. ఏడుగురు దంపతులు ఈ పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం భక్తులకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారి మాడవీధుల్లో భక్తులు ఏడు మారేడు దళాలను చేత పట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేశారు. రాత్రి స్వామివారికి లీలా కల్యాణం, పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్ పి.వాసు, అర్చకులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని కుంచనపల్లి ఎంవీఆర్ టౌన్షిప్ సమీపం ఒక భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు రూరల్ సీఐ రమేష్, ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, ఆరు మోటారు సైకిళ్లు, ఒక కారు, తొమ్మిది సెల్ఫోన్లు, రూ.1.63 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు.

శాస్త్రోక్తంగా రుద్రహోమం