దళితవాడల్లోని స్కూళ్ల విలీనంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

దళితవాడల్లోని స్కూళ్ల విలీనంపై ఆగ్రహం

Jun 24 2025 4:07 AM | Updated on Jun 24 2025 4:07 AM

దళితవ

దళితవాడల్లోని స్కూళ్ల విలీనంపై ఆగ్రహం

పెనుమంట్ర : మోడల్‌ స్కూళ్ల పేరుతో దళితవాడల్లో ఎంతోకాలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను, యూపీ పాఠశాలలను డౌన్‌ గ్రేడ్‌ చేసి వేరే పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా ఆ పాఠశాలల రద్దు దిశగా ప్రభుత్వ ప్రయత్నిస్తోందని, పెనుమంట్ర మండలంలోని పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెనుమంట్ర మండలంలోని అనేక పాఠశాలలను దూర ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేశారు. పెనుమంట్రలోని దళితవాడలో ఎల్‌ఈ పాఠశాలను డౌన్‌ గ్రేడ్‌ చేసి 3, 4, 5 తరగతులను పెనుమంట్రలో దళితవాడకు దూరంగా ఉన్న పెనుమంట్ర (ఆర్‌) పాఠశాలలో విలీనం చేయడం పట్ల ఆ గ్రామ దళితులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఓడూరు పాఠశాల ఉన్న విద్యార్ధులను మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న నెలమూరు గ్రామంలో యూపీ పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేసి ఆ పాఠశాలలో విలీనం చేయడంతో ఓడూరు గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టారు. నెలమూరుకు కేవలం అరకిలో మీటరు దూరంలో కొమ్ముచిక్కాల జడ్పీ ఉన్నత పాఠశాల ఉండగా నెలమూరు యూపీ పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయడంలో రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఇది దళితులను విద్యకు దూరం చేయడం కోసం జరుగుతున్న కుట్రలో భాగమేనని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడూరు పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉండగా నెలమూరు పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయడం పట్ల ఆందోళన చేపడుతున్నారు. సోమవారం రెండు గ్రామాలకు చెందిన దళితులు పాఠశాలల వద్ద ఆందోళన చేయడమే కాకుండా పెనుమంట్ర తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. తమ పిల్లలను వేరొక పాఠశాలకు పంపించేదిలేదని పేర్కొన్నారు. ఇంతవరకు పెనుమంట్ర మండలంలో జుత్తిగ, పొలమూరు, మాముడూరు, ఆలమూరు, మార్టేరులోని బాసంతిదేవి జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహించారు. ఈ పాఠశాలలో 3 నుంచి 5 తరగతులు ఉన్న విద్యార్థులను వేరొక పాఠశాలల్లో విలీనం చేయగా ఎస్‌.ఇల్లిందలపర్రు గ్రామంలోని యూపీ పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. మండలంలోని ఎస్‌.ఇల్లిందలపర్రు గ్రామం మినహా అన్ని గ్రామాలలో చేసిన విలీనాల విషయంలో అధికారులు అడ్డుగోలుగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో యు నాగేశ్వరరావును వివరణ కోరగా ఆయా పాఠశాలల విద్యార్ధుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విలీనం చేయడం అప్‌గ్రేడ్‌లు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొన్ని గ్రామాలలో తరగతి గదుల కొరత ఉండటం వల్ల సమీప పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను బట్టి ఆ పాఠశాలల్లో విలీనం చేశామన్నారు.

దళితవాడల్లోని స్కూళ్ల విలీనంపై ఆగ్రహం 1
1/1

దళితవాడల్లోని స్కూళ్ల విలీనంపై ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement