
కొల్లేరు అధ్యయనానికి కేంద్ర కమిటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొల్లేరులో కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ) బృంద పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 16న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై కొల్లేరు అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఈ నెల 17, 18 తేదీల్లో ఏలూరు జిల్లాలో కొల్లేరు పరీవాహక ప్రాంతాల ప్రజలతో సమావేశమవుతారు. పూర్వం కొల్లేరు ప్రజల స్థితిగతుల అధ్యయనంపై సుప్రీంకోర్టు నియమించిన అజీజ్, రామన్ సుకుమారన్ కమిటీలు నివేదికలు అందించాయి. తాజాగా మరోసారి సీఈసీ కమిటీ రానుండటంతో కొల్లేరు పరివాహక గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. కొల్లేరు అభయారణ్యంపై 2006 ఏప్రిల్ 10న జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వాధికారులు ఉల్లంఘిస్తున్నారని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కాకినాడకు చెందిన పర్యావరణవేత్త మృత్యుంజయరావు సుప్రీంలో పిటిషన్ వేశారు. సీఎస్ను ప్రతివాదిగా చేర్చారు. దీంతో ఈ ఏడాది జనవరి 16న జస్టిస్ బీఆర్.గవాయి(ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అగస్టీ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రకాంత్లు కొల్లేరులో ఆక్రమణలు తొలగించి మూడు నెలల్లో సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర చేపల రైతు సంఘం తరుపున జీ రాయితీ రైతులు రిట్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు కొంత గడువునిస్తూ సీఈసీ కొల్లేరులో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఈసీ సభ్యులు కొల్లేరులో పర్యటించనున్నారు.
20 వేల ఎకరాలను మినహాయించాలి
కొల్లేరు అభయారణ్యం 77,138 ఎకరాలుగా జీవో 120 ప్రకారం నిర్ణయించారు. కొల్లేరు సరస్సు చుట్టూ 122 గ్రామాల్లో 3 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. సుప్రీం ఆదేశాలతో 2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 31,125 ఎకరాలలో ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేశారు. వీటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, బీఫాం భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. కొల్లేరు పరిధి నుంచి పట్టా, బీఫాం భూములు మినహాయించి, కొత్త సరిహద్దులు నిర్ణయించాలంటూ జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు(ఎన్బీడబ్ల్యూఎల్) 2018లోనే ఆదేశాలిచ్చింది. దీనిని అమలు చేయాలని కోరనున్నారు.
వినతులతో కొల్లేరు ప్రజలు సిద్ధం
కేంద్ర సాధికారిత కమిటీ(సీఈసీ)కి కొల్లేరు గ్రామాల ప్రజలు వినతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈ విషయంపై కొల్లేరు పెద్దలు కీలక సమావేశాలు నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి కొల్లేరు జీ రాయితీ, బీఫాం పట్టా వివరాలతో పాటు గ్రామంలో మౌలిక వసతులైన తాగునీటి చెరువులు, ఇంటి స్థలాల పంపిణీ, రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పంచాయతీ సర్పంచ్ తీర్మానాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు.
వినతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కొల్లేరు ప్రజలు
ఈ నెల 17, 18లో కొల్లేరు గ్రామాల్లో పర్యటన