
రాయితీ కొనసాగించాలి
భీమవరం: సీనియర్ సిటిజెన్స్కు రైల్వేలో రాయితీలు పునరుద్ధరించాలని కోరుతూ భీమవరం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధానమంత్రికి పోస్టుకార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లం వెంకట కృష్ణనాగేశ్వరరావు, బోనం పాండురంగారావు చేతుల మీదుగా హెడ్ పోస్టా ఫీసులో సుమారు 500 పోస్ట్కార్డులు అందచేశారు. కోవిడ్ ముందు వరకు కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలలో మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం రాయితీ ఇచ్చేవారన్నారు. కోవిడ్ కారణంగా రాయితీ నిలిపివేసి నేటికీ పునరుద్ధరించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఎస్సీ పరీక్షకు 738 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు మెత్తం 738 మంది హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం పరీక్షకు 180 మందికి గాను 171 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 180 మందికి 177 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 194 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 200 మందికి 196 మంది హాజరయ్యారు.
14న యోగాంధ్ర మాక్ డెమో
ఏలూరు(మెట్రో): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14న యోగాంధ్ర మాక్ డెమో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈనెల 14న శనివారం ఉదయం గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో 6,197 వేదికల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యోగా మ్యాట్లు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమం పర్యవేక్షించి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఇంతవరకు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 8,46,428 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వట్లూరు టీటీడీసీలో ఉదయం 7 గంటలకు యోగాంధ్ర మాక్ డెమో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
‘నవోదయ’ దరఖాస్తుకు జూలై 29 వరకు గడువు
ఏలూరు (ఆర్ఆర్పేట): 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి జూలై 29 వరకూ గడువు ఉందని ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో సౌకర్యాలు గురించి వివరంగా చెప్పి విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రవేశపరీక్ష డిసెంబర్ 13న నిర్వహిస్తారని తెలిపారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
ఏలూరు(మెట్రో): జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని నూతన జిల్లా పరిషత్ సీఈఓ ఎం.శ్రీహరి చెప్పారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా డీఎల్డీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీహరిని పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సీఈఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు బదిలీపై రావడం ఆనందంగా ఉందన్నారు.
ఉపాధి హామీ జోలికొస్తే ఊరుకోం
అత్తిలి: ఉపాధి హామీ జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చినవీరభద్ర రావు హెచ్చరించారు. అత్తిలి మండలం కొమ్మరలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని సందర్శించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు గత మూడు మాసాలుగా చేసిన పనికి వేతనాలు చెల్లించకపోవడంతో కూలీల ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరంగా మారిందన్నారు. కూలీల బకాయిలపై దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం మోడీ భజన చేస్తుందని, ఇలాగయితే భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.