
జోరుగా విద్యా వ్యాపారం
భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రమంగా ప్రవేశాలు కల్పిస్తూ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ప్రవేశాలు ప్రారంభించగా, స్కూళ్లు తెరవడంతో పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా విద్యా శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు వేసవి సెలవుల్లో ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించగా ప్రభుత్వం ప్రకటించిన తేదీ కంటే ముందుగానే తరగతులు ప్రారంభించారు. అనేక ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామగ్రి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. విద్యాసంస్థల వద్దనే ప్రత్యేక గదుల్లో పుస్తకాలు, సామాగ్రి నిల్వచేసి అమ్ముతున్నారు. ఈ నెలలోనే భీమవరం పట్టణంలోని నారాయణ, చైతన్య స్కూళ్లలో పుస్తకాలు విక్రయిస్తుండగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాడిచేసి విక్రయాలు అడ్డుకున్నారు. విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో నారాయణ స్కూల్ గదిని డీవైఈవో రమేష్ సీజ్ చేశారు. స్కూల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
నారాయణ, చైతన్య గుర్తింపు రద్దు చేయాలి
నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న నారా యణ, చైతన్య స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.గణేష్, టి.ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేయడమేగాక పుస్తకాలు, మిగిలిన విద్యాసామాగ్రిని అధిక ధరలకు విక్రయిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నారాయణలో పుస్తకాల అమ్మకం అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ

జోరుగా విద్యా వ్యాపారం