
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
ద్వారకాతిరుమల: జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మండలంలోని ద్వారకాతిరుమల, గుండుగొలనుకుంట, సూర్యచంద్రరావుపేట గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి వ్యవసాయ, అనుబంధ రంగాల సాగు పద్ధతులను పరిశీలించారు. ద్వారకాతిరుమలలో ఫార్మ్ పాండ్స్ను, గుండుగొలనుగుంటలోని సుబ్రహ్మణేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో ఈ ఏడాది అదనంగా 10 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు లక్ష్యాన్ని సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. సూర్యచంద్రరావుపేట లో బలుసు వీరభద్రయ్య క్షేత్రాన్ని పరిశీలించారు. కోకో రైతులు ఆందోళన చెందవద్దని, కోకో కిలో రూ.500 చొప్పున కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అనంతరం పశుగ్రాసం విత్తనాలను కలెక్టర్ అధికారులతో కలిసి పొలంలో చల్లారు. అనంతరం భీమడోలు మండలం పొలసానిపల్లిలోని ఎస్ఎంఆర్ జీడిపప్పు ప్రాసెసింగ్ సెంటర్ను కలెక్టర్ సందర్శించారు.
యోగాతో ఆరోగ్యం
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ద్వారకాతిరుమలలోని ఏపీ టూరిజం హరిత హోటల్ వద్ద గురువారం జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఆర్డీఓ రమణ, ప్రజలతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా దోహదపడుతుందన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మాలిని, పర్యాటకాభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, తహసీల్దార్ జేవీ సుబ్బారావు, ఎంపీడీఓ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి