
దళిత యువకులపై పోలీసుల తీరు దారుణం
చింతలపూడి: తెనాలిలో దళిత, మైనార్టీ యువకులపై పోలీసులు జరిపిన దుశ్చర్యపై దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చింతలపూడిలో నిరసన తెలిపారు. దళిత సంఘాల ఐక్య జేఏసీ నాయకులు ఎం.ఇమ్మానియేలు, దారా వీరేంద్ర, బుచ్చిబాబు మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళితులు, మైనార్టీ యువకులపై దాడులకు దిగడం, ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాఠీలతో చితకబాదటంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునే వరకూ తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులు మైనార్టీలు అంటే ప్రభుత్వానికి, అధికారులకు ఇంత చిన్నచూపా అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజవర్గంలో దళితులను వెలివేసిన సంఘటన మరువక ముందే తెనాలిలో దళిత యువకులపై దాడులు చేయడంపై ప్రభుత్వం స్పందించాలని అన్నారు. పవన్ కల్యాణ్ సొంత ఇలాకాలో దళితులను వెలివేసినా ఆయన ఇంతవరకు స్పందించకపోవడం దారుణం అన్నారు. జేఏసీ నాయకులు సుందరమ్మ, బూసి నాగేశ్వరరావు, జూపూడి వసంత, భాను తదితరులు పాల్గొన్నారు.