
స్వగృహమస్తు.. ఇరగవరం మండలం కావలిపురం జగనన్న లేవుట్లో ఇళ్లు
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గృహ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను సేకరించి లక్షలాది మందికి పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయంతో పాటు జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. దీంతో కాలనీలు కొత్త ఊళ్లను తలపిస్తున్నాయి. లక్షల విలువైన ఆస్తిగా కాలనీల్లో ఇళ్లు నిలుస్తున్నాయి. ఇలా గృహ లబ్ధిదారులను ప్రభుత్వం లక్షాధికారులను చేస్తోంది.
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా లోని 630 జగనన్న లేఅవుట్లలో 49,802 మంది పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేసి నిర్మాణాలకు ప్రోత్సహిస్తోంది. మొత్తంగా 892.50 ఎకరాలను సేకరించి కాలనీలుగా మార్చింది. భూ సేకరణ, నిర్మాణం, మౌలిక వసతులైన రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరాకు రూ.1,000 కోట్లకు పైగా వెచ్చించింది. ఆయా ప్రాంతాల్లో సెంటు స్థలం విలువ రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున పేదలకు ప్రభుత్వం స్థలాలు మంజూరు చేసింది. స్థలాల విలువ గ్రామీణ ప్రాంతాల్లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. దీంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. మొత్తంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఇంటి విలువ రూ.15 లక్షలకు పైగా ఉంది.
జగనన్న దయతోనే సొంతిల్లు
భీమవరం మెంటేవారితోటకు చెందిన మేడిశెట్టి దుర్గ భర్త సంచులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుర్గ కూలీ పనులకు వెళుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కాగా సొంత ఇల్లు లేదు. దీంతో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. అరకొర సంపాదనతో కుటుంబ జీవనం ఇబ్బందిగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గకు విస్సాకోడేరు జగనన్న లేవుట్లో సెంటు స్థలంతో పాటు ఇల్లు మంజూరయ్యింది. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలకు, కొంత సొంత నగదుతో గృహ నిర్మాణం పూర్తిచేసుకున్నారు. అద్దె బాధలు తప్పాయని, ఇక్కడ సెంటు స్థలం రూ.4 లక్షలు ఉంటుందని, జగనన్న దయతోనే తమ కల నెరవేరిందని ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ సాయంతో నిర్మాణం
భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీకు చెందిన గూడాల పావని గృహిణి. ఆమె భర్త డ్రైవర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా సొంత స్థలం కూడా లేదు. లక్షలు పెట్టి స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. దీంతో ఎనిమిదేళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. పావని తల్లితండ్రులకు కూడా సొంతిల్లు లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పావనితో పాటు ఆమె తల్లి భాగ్యలక్ష్మికి భీమవరం విస్సాకోడేరు లేఅవుట్లో స్థలం మంజూరైంది. ప్రభుత్వ సాయంతో వీరు ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. తమ సొంతింటి కల జగనన్న నెరవేర్చారని, ఈ లేఅవుట్లో సెంటు స్థలం రూ.4 లక్షల వరకు ఉంటుందని పావని ఆనందంగా చెబుతున్నారు.
లక్షణంగా నిర్మాణాలు
పేదల సొంతింటి కల సాకారం
లక్షల విలువ చేసే ఆస్తిగా ఇల్లు
జిల్లాలో గృహ నిర్మాణాలకు రూ.1,000 కోట్లకు పైగా వెచ్చించిన ప్రభుత్వం
మొత్తంగా 71,283 ఇళ్ల మంజూరు
ఊళ్లను తలపిస్తున్న జగనన్న కాలనీలు
పశ్చిమగోదావరిలో ఇళ్ల నిర్మాణం
సేకరించిన భూమి (ఎకరాలు) 892.50
లేఅవుట్లు 630
లేఅవుట్లలో మంజూరైన ఇళ్లు 49,802
సొంత స్థలంలో మంజూరైనవి 21,481
మొత్తం మంజూరైన ఇళ్లు 71,283
పూర్తయిన ఇళ్లు 26,985
వివిధ దశల్లో నిర్మాణాలు 44,298


