ఏలూరు (ఆర్ఆర్పేట) : అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ.. రవికాంచని చోటు కవి కాంచును.. అని తెలుగునాట సామెత. కవిత్వం గొప్పతనాన్ని తెలియజేసే ఉపమానాలు ఎన్నో ఉన్నాయి. మనసులను కదిలించేది కవిత.. నిద్రాణమైన సమాజాన్ని జాగృతం చేసే సాహిత్య వస్తువు కవిత.. అంతటి ప్రాముఖ్యమున్న కవితాలోకంలో విశేష సేవ చేసిన కవులు, సాహిత్యకారులు ఎందరో గోదావరి జిల్లా మూలాలకు చెందిన వారు కావడం గర్వకారణం. తన రచనలతో ఎంకి–నాయుడు మామలను సృష్టించి తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నండూరి సుబ్బారావు జిల్లాకు చెందిన వారే. రచయిత అడవి బాపిరాజు, సినీ దర్శకుడు, రచయిత దాసరి నారాయణరావు, రచయితలు బొడ్డు బాపిరాజు, సామవేదం జానకిరామశర్మ, బుచ్చిబాబు, భగవాన్, ప్రస్తుత కవుల్లో రసరాజు, భువనచంద్ర, అనంత శ్రీరామ్ ఇలా సాహితీలోకం కలికితురాళ్లుగా నిలుస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించిన వేల్చేరు నారాయణరావు జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లగా, ఆర్ఆర్ఆర్ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు.
జిల్లా ఖ్యాతిని చాటిన కవులు
నేడు ప్రపంచ కవితా దినోత్సవం