కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దళిత యువకుడు సాయికృష్ణ వమరణంపై పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ కస్టడీ మరణం, ఆ తర్వాత అతని శవాన్ని మాయం చేయడం వెనుక ఉన్న నిజాలను వెలికితీసేందుకు కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం సరికాదని, ప్రతిపక్షాలు, న్యాయవాద సంఘాలు, హక్కుల సంఘాల నిరంతర ఆందోళనల వల్ల ప్రభుత్వం కేవలం కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే హత్య నేరం కింద కేసు నమోదు చేసిందన్నారు. 20 రోజులుగా ఈ దారుణ ఘటనను దాచడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వెనుక కేసును నీరుగార్చే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ మరణం, శవాన్ని మాయం చేయడం వెనుక ఎస్పీ స్థాయి కంటే పై అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అటువంటప్పుడు కేవలం ఎస్పీ స్థాయి అధికారితోనే విచారణ జరిపించడం హేతుబద్ధం కాదని చెప్పారు. విజయవాడకు చెందిన ఉన్నత పోలీస్ అధికారులందరినీ ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి తక్షణమే విచారించాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ఇవ్వాలన్నారు.
పౌరహక్కుల సంఘం డిమాండ్


