విద్యుత్‌ షాక్‌తో సెంట్రింగ్‌ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో సెంట్రింగ్‌ కూలీ మృతి

Sep 10 2025 3:35 AM | Updated on Sep 10 2025 3:35 AM

విద్యుత్‌ షాక్‌తో  సెంట్రింగ్‌ కూలీ మృతి

విద్యుత్‌ షాక్‌తో సెంట్రింగ్‌ కూలీ మృతి

కపిలేశ్వరపురం: మండలంలోని టేకి గ్రామానికి చెందిన సెంట్రింగ్‌ కూలి వాసంశెట్టి శ్రీనివాస్‌ (30) పని ప్రదేశంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శ్రీనివాస్‌ మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం పడమర ఖండ్రిక గ్రామంలో ఇంటి శ్లాబ్‌ సెంట్రింగ్‌ పనికి వెళ్లాడు. శ్రీనివాస్‌ ఆ భవనం కింది నుంచి ఊసను పైకి లాగుతుండగా 11 కేవీ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వి.శ్రీనివాస్‌, జి.శివకృష్ణలకు స్వల్పగాయాలయ్యాయి. ఇద్దరినీ తొలుత కపిలేశ్వరపురం సీహెచ్‌సీకి, తర్వాత రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్‌ తెలిపారు.

మోటారు సైకిల్‌ ఢీకొని మహిళ..

పెరవలి: మోటారు సైకిల్‌ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం మండలం రావులపాడు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకాయమ్మ (68) మంగళవారం ఉదయం రావులపాలెంలో ఆటో ఎక్కి పెరవలి మండలం కడింపాడు సెంటర్‌లో దిగింది. అక్కడ రోడ్డు దాటుతున్న ఆమెను తణుకు నుంచి రావులపాలెం వైపు వెళుతున్న మోటారు సైకిల్‌ వేగంగా ఢీకొంది. దీంతో వెంకాయమ్మ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, మైరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా వెంకాయమ్మ మృతి చెందింది. మృతురాలి కుమారుడు కొప్పిశెట్టి వీరభద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

వ్యాన్‌ కింద పడి..

ముమ్మిడివరం: ఠానేల్లంక ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్‌ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. కూనాలంకకు చెందిన కొప్పిశెట్టి గంగరాజు (45) మోటారు సైకిల్‌పై ముమ్మిడివరం వెళుతున్నాడు. రాజుపాలెం వద్ద ముమ్మిడివరం వైపు వెళుతున్న వ్యాన్‌ను తప్పించబోయి దాని కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంగరాజుకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్సై డి.జ్వాలా సాగర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రైవేటు బస్సు ఢీకొని..

గండేపల్లి: మల్లేపల్లికి చెందిన మడపాటి సూరిబాబు (34) తాళ్లూరు సమీపంలోని సామిల్లు వద్ద తాపీపనికి వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన నిలుచున్న అతడిని విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గండేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రూ.1.15 లక్షల ఎరువుల సీజ్‌

అంబాజీపేట: నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచిన రూ.1.15 లక్షల విలువైన 5.20 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎస్‌.తాతారావు, మండల వ్యవసాయ అధికారి కె.ధర్మప్రసాద్‌ తెలిపారు. మాచవరంలోని సుభూషణ్‌ ట్రేడర్స్‌ ఎరువుల దుకాణాన్ని రాజమహేంద్రవరానికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగ అధికారులతో కలిసి మండల వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.1,15,370 విలువైన ఎరువులను సీజ్‌ చేశారు. తనిఖీలో డీసీటీవో ఎ.నవీన్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ శివకుమార్‌, ఏఈఓ జాజెబ్‌ శాస్త్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement