
సంక్షేమ సంతకం వైఎస్సార్
● జిల్లావ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
● సేవా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు
సాక్షి, రాజమహేంద్రవరం: సంక్షేమ సంతకం చేసి.. దార్శనికుడిగా పేరుగాంచి.. ఆరోగ్య ప్రదాతగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ మహనీయుడు చేసిన సేవలు, సంక్షేమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు కొనియాడారు. మహానేత వర్ధంతి సందర్భంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్కు ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్ర పటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలురువు నేతలు మాట్లాడుతూ పేదల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా నిరంతరం పనిచేసిన మహానేత వైఎస్సార్ అని కొనిడాయారు. ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. అందుకే ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారని అన్నారు.
ఆ లోటు తీరనిది
రాజమండ్రి రూరల్: రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం వేమగిరి జంక్షన్, కొంతమూరు గ్రామాల్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు వైఎస్కు ఘన నివాళులు అర్పించారు. అంకితభావంతో రాజకీయాల్లో కొనసాగిన మహనీయుడు వైఎస్ అన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికి తీరనిదని, నేటికీ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.
కోటగుమ్మం జంక్షన్లో..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి కోటగుమ్మం సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.
కొవ్వూరులో అన్నదానం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్థంతిని కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో మెయిన్రోడ్డు, వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలను, ఆయన చేపట్టిన సంక్షేమాన్ని స్మరించుకున్నారు.
అనపర్తిలో..
నియోజకవర్గ కేంద్రమైన అనపర్తి కెనాల్ రోడ్డులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్ అని కొనియాడారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రాంబాబు పాల్గొన్నారు.
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని మంగళవారం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్నాయుడు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు.
గోపాలపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. గోపాలపురంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
మహానేత వైఎస్ఆర్
రాజానగరం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్థంతి సందర్భంగా రాజానగరం వైఎస్సార్ సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు, యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
రాజమండ్రి సిటీ: రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని పార్టీ సిటీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి రామచంద్రారెడ్డి, భరత్, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ భరత్ క్వారీ సెంటర్లో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకట్రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంక్షేమ సంతకం వైఎస్సార్