
కేంద్ర కారాగారాన్ని సందర్శించిన డీఎల్ఎస్ఏ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి ఎన్.శ్రీలక్ష్మి మంగళవారం సందర్శించారు. కేంద్ర కారాగారం, మహిళా జైలులో ఖైదీలకు అందిస్తున్న ఆహార ప్రమాణాలు, సదుపాయాలు పరిశీలించారు. ఖైదీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు వేయాలన్నా, పైకోర్టుల్లో అప్పీలు చేయాలన్నా, ఎటువంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. దీనికి పారా లీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు సమర్పించాలన్నారు. ముద్దాయిలు, ఖైదీలకు అందుబాటులో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు.
పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలు
ధవళేశ్వరం: సంప్రదాయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా అత్యంత ప్రతిభతో పాటకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కొనియాడారు. రాకా సాంస్కృతిక సంస్థ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో పద్మశ్రీ ఘంటసాల విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి మంగళవారం ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కష్టతరమైన పాటలు కూడా ఎస్పీ బాలు అవలీలగా పాడారని, ఆయనను ఎవరూ అనుకరించలేరన్నారు. ఎంపీని సినీనటులు శుభలేఖ సుధాకర్, రాకా సాంస్కృతిక సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, జివి రమణ సత్కరించారు.
ఐసీటీసీలో సేవలు మెరుగుపర్చాలి
– కేంద్ర బృందం తనిఖీ
పెద్దాపురం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఐసీటీసీ విభాగంలో మంగళవారం కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డీడీ యూబీ దాస్, నాకో కన్సల్టెంట్లు రాహుల్ ఆహూజా, డాక్టర్ జస్వందర్ సింగ్, ఏపీ స్టేట్ సొసైటీ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. తనిఖీ అనంతరం ఐసీటీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఐసీటీసీలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐసీటీసీ భాగస్వామి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీటీసీ, సంపూర్ణ సురక్ష కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సోచ్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఐసీటీసీలోని రికార్డులను పరిశీలించి, ఇక్కడి సేవలపై కౌన్సెలర్ బి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట అదనపు పీడీ డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ ఉమామహేశ్వరి ఉన్నారు.
ఉచిత బస్సుతో ఆటోడ్రైవర్ల ఉపాధికి గండి
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి, ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిందని ఆంధ్ర ఆటోవాలా జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆటో డ్రైవర్లు నల్ల బ్యాఢ్జీలు ధరించి, ఆటోలకు నల్ల జెండాలు తగిలించి నిరనస తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో మంగళవారం డివిజన్ ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. దీనిపై సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. త్వరలోనే 48 గంటల పాటు ఆటోలు నిలిపివేసి నిరాహార దీక్షలు చేపడతామని ఆయన వెల్లడించారు. రామచంద్రపురం డివిజన్ ఆటో డ్రైవర్లతో బుధవారం నిర్వహించే సమావేశంలో ఆ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 25 శాతం ఆటోలు విద్యాసంస్థలకు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో ఆ ఆటోల డ్రైవర్లు 48 గంటల నిరాహార దీక్షకు రెండు రోజుల ముందు ఆయా విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశం సూచించింది. తక్షణమే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆటోవాలా జిల్లా శాఖ కార్యదర్శి ఊటాల వెంకటేష్ నిరసన తీర్మానాలు సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆటో యూనియన్ల ప్రతినిధులు మోకా శ్రీను, వాసంశెట్టి శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి, రాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర కారాగారాన్ని సందర్శించిన డీఎల్ఎస్ఏ

కేంద్ర కారాగారాన్ని సందర్శించిన డీఎల్ఎస్ఏ