
శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ
పశ్చిమ రాజగోపురం వద్ద..
కాగా, విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణ పనులు కూడా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో వంద అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పున టెన్సిల్ షెడ్డు నిర్మించేందుకు లారెస్ కంపెనీ సంసిద్ధత తెలిపిందని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసి పనులు ప్రారంభిస్తారని తెలిపారు.
అన్నవరం: శ్రావణ మాసం సందర్భంగా రత్నగిరిపై పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ నిధులతో సత్యదేవుని నిత్య అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్లు తదితర నిర్మాణాలకు టూరిజం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫ్మార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్నంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం టెండర్ గత వారం ఖరారైన సంగతి తెలిసిందే. రూ.18.98 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ నిర్మాణ పనులకు మూడో విడతగా మే నెలలో పిలిచిన నోటిఫికేషన్కు ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా, రాజమహేంద్రవరానికి చెందిన గాలి సుబ్బరాజు అండ్ కంపెనీ 3.69 శాతం తక్కువకు టెండర్ దక్కించుకుంది. దీంతో ‘ప్రసాద్’ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణ మాసంలో ఈ పనులు ప్రారంభించనున్నారు. టెండర్ ఖరారుకు ముందే టూరిజం శాఖ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య అన్నవరం దేవస్థానానికి విచ్చేసి, ప్రసాద్ నిర్మాణాల స్థలాలకు జియో ట్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రసాద్ స్కీం నిర్మాణాలివీ..
● రూ.11.09 కోట్ల వ్యయంతో పాత టీటీడీ భవనం పక్కనే రెండంతస్తుల అన్నదాన భవనం
● ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.5.9 కోట్ల వ్యయంతో క్యూ కాంప్లెక్స్
● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా రూ.61.78 లక్షల వ్యయంతో నిర్మించనున్న టాయిలెట్స్ బ్లాక్లు
● రూ.1.08 కోట్ల వ్యయంతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్
● రూ.91.96 లక్షల వ్యయంతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ
ఇవే కాకుండా ప్రసాద్ నిధులతో దేవస్థానానికి రూ.కోటి వ్యయంతో రెండు బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. వీటిని దేవస్థానంలో సత్రాల నుంచి స్వామివారి ఆలయం, వ్రత మంటపాల మధ్య భక్తులను తరలించేందుకు ఉపయోగించనున్నారు.
శంకుస్థాపనకు ఏర్పాట్లు
అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ నిధులతో వివిధ నిర్మాణాలకు శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనంతరం నిర్మాణాలు వేగంగా కొనసాగించి, రెండేళ్లలోపు పూర్తి చేస్తాం.
– ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, టూరిజం శాఖ
పట్టాలెక్కనున్న ‘ప్రసాద్’ నిర్మాణాలు
అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్ల నిర్మాణాలకు త్వరలో శంకుస్థాపన

శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ

శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ