
చేప ముల్లు తీసి.. ప్రాణం నిలిపి..
కాకినాడ క్రైం: గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళ ప్రాణాలను కాకినాడ వైద్యులు రక్షించారు. సంబంధిత వివరాలను కాకినాడ అపోలో ఆసుపత్రి యాజమాన్య గురువారం వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన మహిళ జంప మంగాయమ్మ (54) ఫోన్ మాట్లాడుతూండగా గుండె నొప్పికి గురైంది. ఆమెను కుటుంబ సభ్యులు గత నెల 25వ తేదీన కాకినాడ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించి గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ఉందని తేల్చారు. ఆమెను రక్షించేందుకు ఛాతికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ చేయడానికి 12 గంటల సుదీర్ఘ సమయం పట్టింది. ఇది దేశంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స అని వైద్యులు తెలిపారు. వైద్య బృందానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ గూడె వంశీ చైతన్య, వాస్క్యులర్ సర్జన్ కృష్ణ, గుండె మత్తు వైద్య నిపుణుడు ప్రగడ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు.

చేప ముల్లు తీసి.. ప్రాణం నిలిపి..