
రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
చాగల్లు: రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు. బుధవారం చాగల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెనాలిలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ నడిరోడ్డుపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. దళితులపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని, చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టొద్దని దళిత, మైనార్టీ యువకులు వేడుకుంటున్నా పోలీసులు నడిరోడ్డుపై లాఠీలతో చితకబాదటం దారుణమన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలు, బడుగులకు ఆత్మగౌరవంతో బతికే హక్కు లేదా? వారిని పశువులను కొట్టినట్లు నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఏ రాజ్యాంగం ఇచ్చింది?’ అని వెంకట్రావు ప్రశ్నించారు. ’రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులు, మైనారిటీలను ఇలాగే హింసించాలని ఉందా అని ప్రశ్నించారు. ఇంతటి అమానవీయ ఘటన జరిగితే కనీసం దళిత హోంమంత్రి కూడా. స్పందించరా? యువకులను కొడుతుండగా వీడియోలు తీసి పోలీసులు ఎవరికి పంపారు? దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటనను చూసి దళితులు, మైనారిటీలు అభద్రతాభావానికి లోనవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తెనాలి ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో
పోస్టులు పెట్టాడన్న కారణంతో..
స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడన్న కారణంతో రాజమహేంద్రవరానికి చెందిన అనే దళిత యువకుడిని పోలీసులు స్టేషన్కి పిలిపించి కొట్టి బెదిరించారని, అర్ధనగ్నంగా లాకప్లో నిలబెట్టి మహిళా కానిస్టేబుల్ను కాపలాగా ఉంచి మానసికంగా వేధించారని వెంకట్రావు గుర్తు చేశారు. గుంటూరు జిల్లా కంతేరులో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలికి చీర మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి 20 మంది పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి లాక్కెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందన్న కారణంగా పాలేటి కృష్ణవేణి అనే మహిళను హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారని, ఆమెను కలిసే అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కే బేడీలు వేశారని వివరించారు.
వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు ధ్వజం