వారం వారం చంద్రబాబు అప్పులు | - | Sakshi
Sakshi News home page

వారం వారం చంద్రబాబు అప్పులు

Apr 18 2025 12:07 AM | Updated on Apr 18 2025 12:07 AM

వారం వారం చంద్రబాబు అప్పులు

వారం వారం చంద్రబాబు అప్పులు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై చేసిన

దుష్ప్రచారానికి సమాధానం చెప్పాలి

టీటీడీ గోశాలలో గోవుల మృతిపై విజిలెన్స్‌ విచారణ జరపాలి

మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ డిమాండ్‌

రాజమహేంద్రవరం సిటీ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న సీఎం చంద్రబాబు పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేశారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ విమర్శించారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ అనేక రకాలుగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు చేస్తున్న అప్పులపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ నగర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టిస్తాం, పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారం వారం అప్పులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టినట్లేనంటూ వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆనాడే చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అవాస్తవాలు ప్రచారం చేసి, రుజువు చేయలేకపోయారన్నారు. ఇప్పుడు టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, దీనికి ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. ఇంత ఘోరం జరిగితే సనాతన పవన్‌ కల్యాణ్‌ ఎక్కడున్నారని నిలదీశారు. టీటీడీ ఈఓ గతంలో 170 గోవులు చనిపోయాయంటున్నారని, మూడు నెలల్లో 40 మాత్రమే చనిపోయాయని చెప్పడం దారుణమని అన్నారు. గోవుల మృతిపై విజిలెన్స్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. గోవుల మృతికి టీటీడీ చైర్మన్‌, పాలక మండలి సభ్యులు, ఈఓ బాధ్యత వహించాలని అన్నారు.

కందుకూరికి అగౌరవం

గతంలో కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహం తొలగించి, ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడం కందుకూరిని అగౌరవపరచడమేనని అన్నారు. అలాగే, జేఎన్‌ రోడ్డులో ఏకేసీ కళాశాలకు ఆనుకుని ఉన్న హ్యాపీ స్ట్రీట్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట ఉన్న పార్కులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టారని, ఇది దారుణమని అన్నారు. కావాలనుకుంటే కొత్తగా మరో పార్కు నిర్మించి, ఎన్టీఆర్‌ పేరు పెట్టుకోవాలని హితవు పలికారు.

సూపర్‌ బజార్‌ ముడుపుల ఆరోపణల నిగ్గు తేల్చాలి

గౌతమి సూపర్‌ బజార్‌ వ్యవహారంలో తనకు రూ.5 కోట్లు ఇచ్చారంటూ ఈవీఎం ఎమ్మెల్యే ఆరోపించారని, వీటిని నిరూపించాలని సవాల్‌ చేశారు. ఇప్పుడు అక్కడ భవన నిర్మాణం జరుగుతోందని, పనులు తక్షణం ఆపకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. లాలాచెరువు వద్ద జాతీయ రహదారి సమీపాన హోండా షో రూం ఎదురుగా ఉన్న 1,300 గజాల భూమి మిగులు అని, పా ర్క్‌ స్థలమని పేర్కొంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పందిరి మహాదేవుడు సత్రం భూముల మాదిరిగానే లాలాచెరువు భూమిని కూడా కాపాడేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల పరిశీలనకు ఒక కమిటీ వేయాలని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement