షర్మిలారెడ్డికి కీలక పదవి | - | Sakshi
Sakshi News home page

షర్మిలారెడ్డికి కీలక పదవి

Jan 12 2024 3:20 AM | Updated on Jan 12 2024 3:20 AM

- - Sakshi

ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నియామకం

సాక్షి, రాజమహేంద్రవరం: మహిళా పక్షపాతిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలక పదవుల్లో మహిళలను నియమిస్తున్నారు. అందులో జిల్లా వాసులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఆచంట అనసూయను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజమహేంద్రవరానికి చెందిన మేడపాటి షర్మిలారెడ్డిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో షర్మిలారెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇప్పటి వరకూ ఈ పదవిలో పెద్దాపురానికి చెందిన దవులూరి దొరబాబు కొనసాగేవారు. ప్రస్తుతం ఆయనకు వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన స్థానంలో షర్మిలారెడ్డికి అవకాశం కల్పించారు.

గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలతో పాటు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగర పంచాయతీ, 26 మండలాల్లోని 280 గ్రామాలతో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) ఉండేది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరం, కాకినాడలకు వేర్వేరు నగరాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేశారు. 2021లో రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (రుడా) ఏర్పాటైంది. దీనికి తొలి చైర్‌పర్సన్‌గా షర్మిలారెడ్డి నియమితులయ్యారు. గత ఏడాది ఆగస్టు వరకూ ఆ పదవిలో ఆమె కొనసాగారు. రుడా చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన కాలంలో రాజమహేంద్రవరంతో పాటు రుడా పరిధిలోని ఇతర నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఆమె అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. నగర సుందరీకరణకు పెద్దపీట వేశారు. ఆమె సేవలను గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి ఇంటి పట్టాలు అందజేశారని అన్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కార్యక్రమంలో తననూ భాగస్వామిని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. రుడా చైర్మన్‌ ఇతరులకు కేటాయించిన సమయంలో తనకు అంతకంటే మంచి పదవి ఇస్తానన్నారని, అన్నట్టుగానే హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ‘చెప్పారంటే.. చేస్తారంతే’ అన్న నానుడిని సీఎం జగన్‌ మరోసారి నిజం చేశారన్నారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు పని చేస్తానని షర్మిలారెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement