సత్యదేవునికి సిరుల వృష్టి | - | Sakshi
Sakshi News home page

సత్యదేవునికి సిరుల వృష్టి

Jun 26 2025 6:43 AM | Updated on Jun 26 2025 6:43 AM

సత్యదేవునికి సిరుల వృష్టి

సత్యదేవునికి సిరుల వృష్టి

అన్నవరం: రత్నగిరి సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గత 35 రోజులకు హుండీల ద్వారా రూ.2,12,38,410 ఆదాయం సమకూరింది. బుధవారం హుండీలను లెక్కించగా రూ.2,00,76,264 కరెన్సీ, రూ.11,62,146 చిల్లర నాణేలు వచ్చాయని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. సరాసరిన రోజుకు రూ.6,06,811 నమోదైనట్టు తెలిపారు. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం నెలకు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు వస్తుంది. కానీ రూ.2 కోట్లు దాటి రావడం అరుదనే చెప్పాలి.

602 గ్రాముల బంగారం..

హుండీలలో నగదుతో పాటు బంగారం సైతం రికార్డు స్థాయిలో 602 గ్రాములు వచ్చింది. బంగారం సైతం ప్రతి నెలా 50 నుంచి 60 గ్రామలు మాత్రమే వస్తుంది. ఈ సారి ఏకంగా పది రెట్లు రావడం గొప్ప విషయమే. ఈ బంగారం మార్కెట్‌ విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. అలాగే వెండి 613 గ్రాములు వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ కుటుంబం స్వామి వారికి నిలువుదోపిడీ (తాము ధరించిన ఆభరణాలు) సమర్పించినట్టు అధికారులు తెలిపారు. అలాగే వంద గ్రాముల బంగారు బిస్కెట్‌ కూడా హుండీలో వచ్చినట్టు తెలిపారు.

పోటెత్తిన భక్తులు

సత్యదేవుని కల్యాణోత్సవాల అనంతరం మే 21న లెక్కించిన తరువాత మళ్లీ బుధవారం హుండీలను లెక్కించారు. వేసవి సెలవులు, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహాలు ఎక్కువగా జరగడంతో భక్తులు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు అధికారులు చెప్తున్నారు.

భారీగా విదేశీ కరెన్సీ

సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్‌ డాలర్లు 87, సౌదీ అరేబియా రియల్స్‌ 55, సింగపూర్‌ డాలర్లు రెండు, బోత్స్వానా కరెన్సీ రెండు పులాలు, ఖతార్‌ రియల్స్‌ ఒకటి, యూఏఈ దీరామ్స్‌ 40, యూరోలు 20, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ బైసా 600 లభించాయి. హుండీ లెక్కింపులో ఈఓతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

35 రోజులకు రూ.2.12 కోట్ల నగదు

602 గ్రాముల బంగారం సమర్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement