
మట్టి అక్రమ తవ్వకాలు ఆపండి
పాపిడిదొడ్డి చెరువు
పిఠాపురం: మా నాయకుడు తవ్వుకోమన్నారు.. ఇటుక బట్టీలకు తరలించమన్నారు.. అంటు జనసేన నేతలు అధికార బలంతో ప్రారంభించిన మట్టి తవ్వకాలకు హైకోర్టు బ్రేక్ వేసిందని రైతులు తెలిపారు. మండలంలోని పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలపై ఇటీవల జనసేన నేతలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరపరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినట్టు గ్రామ రైతులు, గ్రామస్తులు ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి తవ్వకాలు నిలిపివేయాలని గత నెలలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ చెరువు ఇప్పటికే చాలా లోతుగా ఉందని, ఇంకా తవ్వకాలు చేపడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, సాగునీరు అందక పొలాలు బీళ్లుగా మారతాయని అధికారులకు అనేకసార్లు విన్నవించామన్నారు. అయినప్పటికీ కొందరు అధికార పార్టీ నేతలు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. అడ్డగోలు మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ముమ్మిడి మహాలక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు.
జనసేన నేతలకు హైకోర్టు ఝలక్
ఎఫ్కే పాలెం రైతుల హర్షం