
సా..గుతున్న ఖరీఫ్!
జిల్లాలో నారుమళ్ల వివరాలు..
మండలం ఆవశ్యకత పూర్తయినవి నాట్లు
(హెక్టార్లలో) (హెక్టార్లలో) (హెశ్రీశ్రీ)
రాజమండ్రి రూరల్ 73 8 16
కడియం 107 8 –
రాజానగరం 234 55 10
కోరుకొండ 288 30 25
గోకవరం 260 25 90
సీతానగరం 286 150 40
రంగంపేట 141 25 15
చాగల్లు 171 160 50
గోపాలపురం 211 101 –
నల్లజెర్ల 212 35 –
ఉండ్రాజవరం 246 130 –
నిడదవోలు 363 300 10
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ వరి ధాన్యం డబ్బులు విడుదలలో జాప్యం.. అందని అన్నదాత సుఖీభవ నిధులు.. ఆపై కరుణించని వరుణుడు.. కాలువల ఆధునీకరణలో నిర్లక్ష్యం.. డెల్టా కాలువలకు సకాలంలో నీరు వదిలినా పొలాలకు చేరడంలో ఆలస్యం వెరసి ఖరీఫ్ సాగు నత్తలా సాగుతోంది. ఈ సమయానికే నారుమడులు పూర్తి కావాల్సి ఉన్నా.. 60 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి.
రుతుపవనాల కదలికతో..
ఖరీఫ్కు రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే వాటి కదలిక నెమ్మదించడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచాయి. ఉక్కపోతతో ప్రజల అల్లాడిపోయారు. దీంతో సాగుకు కర్షకులు వెనకడుగు వేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,800 హెక్టార్లలో నారుమళ్లకు అవకాశం ఉండగా.. సోమవారం నాటికి రెండు వేల హెక్టార్లలో నారుమళ్లు వేశారు. 7 మండలాలు మినహా.. మిగిలిన చోట్ల వరి నాట్లు వేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే వంద శాతం నారుమళ్లు పూర్తవ్వాల్సి ఉందని రైతులు అంటున్నారు.
అధ్వానంగా కాలువల ఆధునీకరణ
గోదావరి డెల్టా పరిధిలోని కాలువలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సాగునీరు విడుదల చేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.8 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. డెల్టాలోని పంట పొలాలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో కాలువల నిర్వహణ (క్లోజర్) పనులపై ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 18 నియోజకవర్గాల పరిఽధిలో 972 పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. తిరిగి కాలువలకు నీరు వదిలేలోగా కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు. డెల్టా ప్రధాన కాలువలకు ఈనెల ఒకటో తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకా పనులు చేస్తూనే జరుగుతూనే ఉన్నారు. నీరు వదిలి 25 రోజులు గడుస్తున్నా కాలువల్లో పూడికతీత, గుర్రపుడెక్క తొలగిస్తున్నారు. ఇలా పనులు సాగుతుంటే నీరు ఎప్పటికి పొలాలకు చేరుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పొలాలకు సాగునీరు అందక సాగు నారుమళ్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని రైతులు వాపోతున్నారు.
పెట్టుబడులకు పాట్లు
ధాన్యం విక్రయించిన 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదు. గత నెల 24వ తేదీ నాటికి 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టుబడులకు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వచ్చింది.
అందని ‘అన్నదాత సుఖీభవ’
సాగును ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద ఏటా రూ.13,500 పెట్టుబడి నిధి కింద అందజేసేది. ఎవరి దగ్గర అప్పులు చేయకుండా పంట సాగు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించి మోసం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ ఇవ్వకపోవడంతో పెట్టుబడులకు అప్పులు చేయాల్సి పరిస్థితి తలెత్తింది.
నారుమళ్లు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 74 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఇందుకు 3,800 హెక్టార్లలో నారుమళ్ల అవసరం ఉండగా.. ఈనెల 23వ తేదీ నాటికి వ్యవసాయ శాఖ ఇచ్చిన గణాంకాల మేరకు రెండు వేల హెక్టార్లలో మాత్రమే పూర్తయ్యాయి. 305 హెక్టార్లలో నాట్లు వేసినట్లు వెల్లడించారు. 7 మండలాల్లో తప్ప మిగిలిన అన్ని మండలాల్లో వరి నాట్ల ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. చాగల్లు, గోకవరం, సీతానగరం దేవరపల్లి, కొవ్వూరు నిడదవోలు రాజమండ్రి, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు మండలాల్లో నాట్లు ముమ్మరం చేసినట్లు వెల్లడిస్తోంది. వెదజల్లు పద్ధతిలో సాగు చేశారు.
పూర్తికాని క్లోజర్ పనులు
పొలాలకు చేరని నీరు
జిల్లాలో ఆలస్యంగా నారుమళ్లు
నారుమళ్లు వేగవంతం
సార్వా సీజన్లో వరి ప్రాధానమైన పంట. నారుమళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. రైతులకు అవగాహన కల్పిస్తుస్తూ అవసరమైన సహకారం అందిస్తున్నాం. అనుకున్న సమయానికి వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. వరికి జిల్లాలో నీటికొరత లేదు. ఈ సీజన్లో జూన్ 1వ తేదీన నీటిని విడుదల చేశాం.
– ఎస్.మాధవరావు, వ్యవసాయ అధికారి
అధ్వానంగా కాలువలు
గోదావరి డెల్టా పరిధిలోని పంట కాలువలు, చానల్స్ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ప్రారంభంలో షార్ట్ క్లోజర్ పనులు చేపడతామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా పనులు చేపట్టిన దాఖలాలు లేవు. కాలువల్లో ఉన్న పూడిక, గుర్రపుడెక్క అలాగే ఉండిపోయింది. ఈ పరిణామంతో రబీలో రైతులకు నీటి ఎద్దడికి కారణమైంది. దీనికి తోడు పంట కాలువల ద్వారా వస్తున్న నీటిని ఆక్వా రైతులు మోటార్లతో తోడేయడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా చేపట్టిన క్లోజర్ పనులను సైతం తూతూ మంత్రంగా చేపట్టినట్లు సమాచారం. ఖరీఫ్ సాగు దృష్ట్యా కాలువలకు నీరు వదిలినా కాలువల ఆధునీకరణ, పూడిక తొలగింపు వల్ల పూర్తి స్థాయిలో నీరు దిగువకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నీటి కొరత నేపథ్యంలో రైతులు దుక్కులు సైతం చేయలేని దుస్థితి తలెత్తింది. జూలై మూడో వారంలో నాట్లు పూర్తి చేస్తే ఖరీఫ్ చివరిలో విపత్తులు, వరదలు, వర్షాలు కురిసినా.. పంటను రక్షించుకునే అవకాశం ఉంటుంది. నాట్ల ప్రక్రియ ఆలస్యమైతే పంటను కోల్పోవాలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సా..గుతున్న ఖరీఫ్!

సా..గుతున్న ఖరీఫ్!