
రేపు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ని ప్రారంభించేందుకు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ పాల్గొంటారన్నారు. కావున ఈ సమావేశానికి పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ
కమిటీల్లో నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ బుధవారం కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా అంగాడ సత్యప్రియ (రాజమహేంద్రవరం రూరల్), రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీలుగా పరిమి సోమరాజు ( కొవ్వూరు), నరహరశెట్టి రాజేంద్ర బాబు (గోపాలపురం), నాగమళ్ల వీరభద్రరావు (అనపర్తి), రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా గెడ రాంబాబు (గోపాలపురం), స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా దొడ్డ సత్తిబాబు (నిడదవోలు) లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సర్టిఫికెట్ల పరిశీలనకు
183 మంది హాజరు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం బుధవారం సర్టిఫికెట్లు పరిశీలనకు 183 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు తెలిపారు. పరిశీలన అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్టు ఆయన తెలిపారు. గురువారం 86,001 నుంచి 1,04,000 వరకు వరకూ అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే ఒకటి నుంచి 50,000 ర్యాంకు వరకు అభ్యర్థులు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు.
ప్రజల్లో విశ్వాసం
పెంపొందించాలి
పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం
కాకినాడ క్రైం: పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, అందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలలపై చోటు చేసుకుంటున్న నేరాలను నియంత్రించాలన్నారు. హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. మిస్సింగ్ కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కుటుంబ కలహాల్లో పరస్పర దాడులు జరగకుండా చూడాలన్నారు. ఆస్తుల చోరీల్లో రికవరీలు పెంచాలన్నారు. డ్రోన్ల సాయంతో శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా పెంచాలని సూచించారు. గంజాయి నిందితులను గుర్తించి నేరాల బాట పట్టకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఏలూరు ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
రేపు జాబ్మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధికల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మెడ్ప్లస్, జేవీఎస్ టెక్నాలజీ, శ్రీభవానీ కాస్టింగ్, ఇన్నోసోర్స్ సర్వీస్ లిమిటెడ్, పేటీఏం సంస్థలు 615 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హతల గల అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వివరాలకు 86398 46568 నెంబరులో సంప్రదింవచ్చన్నారు.

రేపు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం