
ఇన్స్పైర్కు వేళాయె..
రాయవరం: చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు.
ప్రతి పాఠశాలకూ అవకాశం
ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–09 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
ప్రాజెక్టులను పంపండిలా..
www.inspireawards-dst.gov.in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీ లోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి.
నిబంధనలు ఇవే..
ముందుగా పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను తీర్చే విధంగా ఆలోచన ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతిని నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు సెప్టెంబరు 15 తుది గడువు.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 945 ప్రాజెక్టులు నమోదయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జమ చేశారు. అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ వాటి రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల, ఎంపికయ్యే వాటి సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడంతో దీనికి కారణంగా తెలుస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 202 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి కనీసం మూడు, ఉన్నత పాఠశాలల నుంచి ఐదు ప్రాజెక్టులు రూపొందించాలి.
సృజనాత్మక ఆవిష్కరణలకు ఆహ్వానం
ప్రతి పాఠశాల నుంచి
ప్రాజెక్టులు పంపే వీలు
బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం
హెచ్ఎంలు చొరవ చూపాలి
విద్యార్థులు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్స్పైర్ మనక్ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– కె.వాసుదేవరావు, డీఈవో, తూర్పుగోదావరి జిల్లా
జాతీయ స్థాయిలో నిలిచేలా..
జిల్లా నుంచి వెళ్లే ప్రాజెక్టులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు విద్యార్థులు సృజనాత్మక ప్రాజెక్టులు తయారు చేసేలా ప్రోత్సహించాలి. – జీవీఎన్ఎస్ నెహ్రూ, జిల్లా సైన్స్ అధికారి

ఇన్స్పైర్కు వేళాయె..

ఇన్స్పైర్కు వేళాయె..