రామచంద్రపురం రూరల్: ప్రసిద్ది చెందిన ద్రాక్షారామ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంపై మాజీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్పై నిప్పులు చెరిగారు. ఆ ఆలయానికి ఎలాంటి ఆస్తులూ లేవని, సరైన ఆదాయం లేదని, అయినప్పుటికీ నిబంధనలకు విరుద్ధంగా కేవలం మంత్రి సుభాష్ చెప్పినందుకు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సుభాష్ ఏం చెబితే అది చేసేస్తారా.. చట్టం చూసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. 63 ఏళ్లుగా ఆలయంలో చందాలు వేసుకుని ప్రతి ఏటా కార్తిక మాసం చివరి మంగళవారం రోజున కార్తిక మాస దీపారాధన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కమిటీకి కనీసం నోటీసు ఇవ్వకుండా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఇప్పటికై నా సరిచేసుకోవాలని సూచించారు. అలా కాకపోతే త్వరలో ద్రాక్షారామలో మౌన ప్రదర్శనకు దిగుతామని హెచ్చరించారు.
మంత్రి సుభాష్కు బోస్ హెచ్చరిక..
ఆలయం విషయంలో తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని, ఇప్పటికై నా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి సుభాష్కు బోస్ సూచించారు. సరైన నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ తాము రాజకీయాలు చేయడానికి కాదని, భక్తుల మనోభావాలను గౌరవించకుండా మంత్రి సుభాష్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ తరపున ఖండిస్తున్నామని చెప్పారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవాని, వైస్ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి, శాకా బాబీ తదితరులు పాల్గొన్నారు.


