అమలాపురం రూరల్: సమాజ అభివృద్ధిలో వృత్తిదారులైన శిల్పులు, వడ్రంగులు, కమ్మరులు, కంసాలీలు, ఇతర చేతివృత్తిదారుల పాత్ర అత్యంత కీలకమైనదని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా గురువారం అమలాపురం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, వివిధ సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి డీఆర్ఓ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఆర్ఓ మాట్లాడుతూ తమ వృత్తి పట్ల అంకితభావంతో శ్రమశక్తితో సృజనాత్మకతతో పనిచేసే వృత్తిదారులు సమాజ నిర్మాణంలో విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు కట్టోజు కన్నాయిదాసు, ఆవపాటి వేణుగోపాలకృష్ణ, కోచూరి చిదంబరరావు, దేవాదుల సూర్యనారాయణమూర్తి, చేబ్రోలు గంగనాగేశ్వరరావు.. విశ్వకర్మ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి పి.భగవాన్, సహాయ సంక్షేమ అధికారి కేఎన్ దొర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


