అమలాపురం టౌన్: దస్తావేజు లేఖర్ల ఉపాధి దెబ్బ తీసేలా ప్రభుత్వం వ్యవహరించడం హేయమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ధ్వజమెత్తారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు చేపట్టిన పెన్డౌన్ నిరసన శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దస్తావేజుల ప్రక్రియను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు. దీనికోసం విడుదల చేసిన జీఓ–396ను తక్షణం రద్దు చేయాలని, లేఖర్లకు ఉపాధికి భరోసా కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖర్ల సమస్యలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, నాయకులు సుంకర లక్ష్మీ మణికుమారి, సుంకర సుధ, సూదా గణపతి తదితరులు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి సురేష్, గౌరవాధ్యక్షుడు గుంటు ఫణి ప్రసాద్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి పందిరి శ్రీహరి రామ్గోపాల్, సంయుక్త కార్యదర్శులు పెద్దిరెడ్డి దుర్గేష్, వెలుతురుపల్లి సుబ్బు, గనిశెట్టి భోగిరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద లేఖర్లు పెన్డౌన్ నిరసనలు చేస్తున్నారు.


